తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్‌

తెలంగాణ

ప్రత్యేక రాష్ట్రం కోసం తపించిన మహోన్నతుడు
వర్ధంతి సందర్భంగా పలువురు నివాళి
వరంగల్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని ఉందని తరుచుగా చెప్పిన జయశంకర్‌ ఆ కల నేరవేరకుండానే 2011, జూన్‌ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆచార్యకు పలువురు నివాళి అర్పించారు. ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలి పోయారు. తెలంగాణ సిద్దాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ ఆగష్టు 6, 1934న వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిస్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్‌`ఛాన్సలర్‌ వరకు ఉన్నత పదవులు పొందారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్‌ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్‌ ముల్కీ ఉద్యమంలో, సాంబార్‌` ఇడ్లీ గోబ్యాక్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. బెనారస్‌, అలీగఢ్‌ విశ్వవిద్యాలయాలనుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్‌ ఓయూలో పీహెచ్‌డీ చేశారు. 1975 నుంచి 1979 వరకు వరంగల్‌ సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1979 నుంచి 1981 వరకు కేయూ రిజిస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్‌ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి గా పనిచేశారు. 1969 తెలంగాణా ఉద్యమంలో జయశంకర్‌ చురుగ్గా పాల్గొన్నారు. అంతకుముందు 1952లో నాన్‌ ముల్కీ ఉద్యమంలో, సాంబార్‌`ఇడ్లీ గోబ్యాక్‌ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. 1954లో తెలంగాణ, ఆంధ్ర రాష్టాల్ర విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన ఫజల్‌ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చారు. 2001 నుంచి కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పలు పుస్తకాలు రాశారు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారు. జయశంకర్‌ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారు. ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలి, తర్వాత మరణించాలని అనేవారు. :తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పేరుమార్చి ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరుపెట్టారు. అలాగే 2016 అక్టోబరు 11న తెలంగాణలో కొత్తగా ఏర్పాటుచేసిన 21 జిల్లాలలో ఒక జిల్లాకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాగా నామకరణం చేసారు.