శాంతిభద్రతల్లో రాజీపడే ప్రసక్తే లేదు

తెలంగాణ

అభిమానులను కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే
బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చేదే లేదు : సీఎం రేవంత్‌రెడ్డి
శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్లపై విషయంలో సీరియస్‌గా ఉంటామన్నారు. టికెట్ల పెంపు, బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. అసెంబ్లీలో చేసిన ప్రకటనకే కట్టుబడి ఉంటామన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సినీ ప్రముఖులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పరిశ్రమ అభివృద్ధికి, ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని చెప్పారు. మహిళల భద్రత, డ్రగ్స్‌ వ్యతిరేక ప్రచారంలో చొరవ చూపాలన్నారు. టెంపుల్‌, ఎకో టూరిజం ప్రమోట్‌ చేయాలని సూచించారు. పెట్టుబడుల విషయంలోనూ సినీ పరిశ్రమ సహకరించాలన్నారు. అన్ని అనుమతులుఉంటేనే సినీ ఇంవెంట్లు నిర్వహించుకోవాలని తెలిపారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలన్నారు. ఒక మహిళ ప్రాణం పోవడంతోనే సంధ్య థియేటర్‌ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని చెప్పారు. ఎవరిపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టలేదన్నారు.