ఓ ఇంటివాడైన టీమిండియా యువ క్రికెటర్‌

క్రికెట్

టీమిండియా యువ క్రికెటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు శృతి రఘునాథన్‌ను పెళ్లి చేసుకున్నాడు. అతికొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో వివాహమాడాడు. గతేడాది నవంబర్‌లో వెంకటేశ్‌-శృతి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్న ఈ యువ స్టార్‌ బ్యాటర్‌ త్వరలో పెళ్లిచేసుకోనున్నట్లు వెల్లడిరచాడు. తాజాగా అంగరంగ వైభవంగా వెంకటేశ్‌-శృతి ఒక్కటయ్యారు. కాగా, శృతి ఫ్యాషన్‌ డిజైనర్‌. బెంగళూరులోని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కంపెనీలో ఆమె పనిచేస్తున్నారు. ఇక వెంటకేశ్‌ అయ్యర్‌ విషయానికొస్తే.. అతను సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఛాంపియన్‌గా నిలవడంలో వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌లో అజేయ అర్ధశతకం సాధించాడు. 26 బంతుల్లో 52 పరుగులు బాదాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో వెంకటేశ్‌ అయ్యర్‌ అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు. ఐపీఎల్‌ చరిత్రలో ప్లేఆఫ్స్‌లో వరుసగా నాలుగు అర్ధశతకాలు బాదిన ఏకైక ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. అంతేగాక ప్లేఆఫ్స్‌లో సురేశ్‌ రైనా తర్వాత అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ ప్రతిభను విశ్వసించిన కేకేఆర్‌ గత మెగావేలానికి ముందు 2022లోనూ రిటైన్‌ చేసుకుంది. ఈసారి కూడా వెంకటేశ్‌ను తమ ఫ్రాంచైజీలోనే కొనసాగించాలని కేకేఆర్‌ మేనేజ్మెంట్‌ భావిస్తోంది. ఐపీఎల్‌లో ఈ ఆల్‌రౌండర్‌ 50 మ్యాచ్‌లు ఆడాడు. 1326 పరుగులు, మూడు వికెట్లు సాధించాడు. ఇందులో ఓ శతకం కూడా ఉంది. టీమిండియా తరఫున రెండు వన్డేలు, తొమ్మిది టీ20లు ఆడాడు. చివరగా 2022 ఫిబ్రవరిలో టీమిండియాకు వెంకటేశ్‌ ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు.