రంగంలోకి శ్రీలంక దిగ్గజ క్రికెటర్
టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్ జింబాబ్వేతో పొట్టి ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. అనంతరం శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సి ఉంది. జులై 27 నుంచి లంకతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో జింబాబ్వే పర్యటనకు బీసీసీఐ యువకులను పంపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరనుంది. ఈ మెగాటోర్నీలో వన్డే ఫార్మాట్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీకి తగ్గట్లుగా భారత్ ప్లాన్ చేస్తోంది. భారత క్రికెట్ భవిష్యత్ గురించి ఆలోచిస్తూ కుర్రాళ్లకు అవకాశాలు అందిస్తుంది. శ్రీలంకతో వన్డే సిరీస్కు సీనియర్లతో పాటు యువకులను జట్టులోకి తీసుకురావాలని చూస్తోంది. టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానీ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ వన్డే సిరీస్కు ఎంపిక కావడం దాదాపు ఖాయమే. మరోవైపు భారత్ సిరీస్ను శ్రీలంక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయామనే కసితో లంక ఉంది. అంతేగాక తమ పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించాలని ప్రణాళికలు రచిస్తోంది.
వన్డే, టీ20 వరల్డ్ కప్ల్లో శ్రీలంక ఘోర పరాజయాలకు ప్రధానంగా కారణం బ్యాటింగ్ వైఫల్యమే. బ్యాటర్లు తేలిపోవడంతో బౌలర్లు పోరాటం వృథాగా మారిపోయింది. ఈ స్థితిలో ఉన్న జట్టును బలోపేతం చేయడానికి క్రిస్ సిల్వర్వుడ్ స్థానంలో కోచ్గా జయసూర్యకు బాధ్యతలు అప్పగించాలని బోర్డు నిర్ణయించుకుందని సమాచారం. జయసూర్య విధ్వంసకర బ్యాటర్గా పరుగుల వరద పారించాడు. 110 టెస్టులు, 445 వన్డేలు, 31 టీ20లు ఆడిన అపారమైన అనుభవం అతని సొంతం. అతని రాకతో లంక రాత మారుతుందేమో చూడాలి!
