ప్రకృతి ప్రేమికులకు ఆటవిడుపు

జాతీయం హోమ్

వైల్డ్ లైఫ్ జాతీయ పార్కుల సందర్శన ఒక మధురానుభూతి


ఆధునిక కాలంలో మానవుడు ప్రకృతికి దూరం అవుతున్నాడు.యాంత్రికంగా జీవితాన్ని వెళ్లదీస్తున్న జీవులకు ఒక మధురానుభూతి కలుగుతుంది.పర్యాటక,ప్రకృతి ప్రేమికులకు ఇదోక వింత అనుభవం.ప్రకృతికి,జంతువులకి దగ్గరగా తీసుకు వెళ్ళి వాటి ప్రవర్తన పై అవగాహన కల్పించడం,ప్రకృతితో మమేవకవడం నేర్పించడం కోసమే “వైల్డ్ లైఫ్ విస్పరర్స్” ఏర్పడింది. జంతువులను ప్రేమించడం,రక్షించడం,వాటితో మానవుడి సంబంధాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తుంది.
డిజిటల్ యుగంలో ప్రతిదానికీ గూగుల్ మీద ఆధారపడుతున్నాం.ఉన్న ఊరిలో దారి చూపాలన్నా గూగుల్ చూస్తాం.మట్టి వాసన మర్చిపోయి ఆకాశహర్మాలలో నివశిస్తున్నాం.ప్రకృతే గురువు,అడవి అతి పెద్ద తరగతి గది,అదే అన్నీ నేర్పుతుంది. కాని నేడు ఆ విషయం మర్చిపోయాం.కాంక్రీట్ జంగిల్ మధ్య జీవితం గడుపుతున్నాం.అదే ప్రపంచం అనుకుంటాం.నూతిలో కుప్పలా బతికేస్తున్నాం.బయటకు వచ్చి ప్రకృతిలో గడిపితే అనేక విషయాలు అవగాహనలోకి వస్తాయి.

విశ్వం సృష్టి ప్రారంభం అయిన తరువాత మొదట నీరు,ఆపై భూమి ఏర్పడ్డాయి.ముందు వృక్ష జాలం,ఆ తరువాత జంతు జాలం సృష్టించబడ్డాయి.చివరకు మానవుడి ఆవిర్భావం జరిగింది.వృక్షాలు,జంతువులతో పాటు మానవుడు జీవిస్తూ వాటిని బతికిస్తూ ప్రకృతి సమతౌల్యం దెబ్బతినకండా చూడాలి.వాటిని మార్చి అడవులను మానవుడు నాశనం చేయడం వల్ల జంతువులు ఊళ్లమీద పడుతున్నాయి. అలా కాకుండా జంతు ప్రేమికుడిగా మారి,వాటి మనసుని,ప్రవర్తన తెలుసుకుంటే ఆ ఆనందం చెప్పలేం. దానికి ఇష్టంతో పాటు జంతువుల పట్ల సాప్ట్ కార్నర్ ఉండాలి.సాధారణంగా ఖాళీ దొరికినప్పుడల్లా స్తోమత ఉంటే ప్రపంచ పర్యటనకు వెళ్తారు.అదీ దేశాల ప్రధాన నగరాలకు వెళ్తారు. అలా కాకుండా సమయం దొరికినప్పుడల్లా వైల్డ్ లైఫ్ జాతీయ పార్కులకు వెళితే అక్కడ ఉన్న జంతువులను,వాటి ప్రవర్తన,వేటను,వేట విధానం ప్రత్యక్షంగా చూడవచ్చు.ఆ అనుభూతి వర్ణించలేం.ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది.జంతువుల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది.అది నేర్చుకునే అవకాశం కలుగుతుంది.వాటికి మాట్లాడే అవకాశం లేక పోయినా జీవనయానంలో ఎదుర్కొనే భయాలను,ప్రమాదాలను అధిగమించడం లో మానవుని కంటే తెలివిగా ఉంటాయి.దానికి అనేక నిదర్శనాలు కనిపిస్తాయి.

మనం ఆధునిక వాహనాల మోడల్ కూడా జంతువుల నుంచే తీసుకుంటున్నాం.బుల్లెట్ రైలు మూతి కింగ్ ఫిషర్ నోటి ఆకారంలా ఉంటుంది.అలాగే ఎయిర్ బస్ ఆకారం అల్బెట్రాస్ పక్షి ఆకారంలో ఉంటుంది.ఇలా జంతువుల నుంచి,పక్షుల నుంచి అనేక అంశాలు మోడల్ గా మారుతున్నాయి.కాని వాటికి ఆ గౌరవం ఇవ్వం.సైబేరియన్ పక్షులు రష్యా తీరం నుంచి మన ఏపీలోని నెల్లూరు జిల్లాకు ప్రతి ఏటా వస్తాయి.అలాగే అవి మళ్లీ వాటి ప్రాంతానికి సురక్షితంగా వెళ్తాయి.మరి వాటికి ఈ బాట తెలియడం వాటి తెలివికి నిదర్శనం.అలాగే ప్రకృతిలోని కొన్ని వృక్షాల విత్తనాలు గాలిలోఎగురుతాయి.అవి అలా ఎగురుతూ పడిన చోట నుంచి పునరుత్పత్తి రూపంలో మొలకెత్తుతాయి.ఇదంతా ప్రకృతి మాయగా భావించాలి.ఇలా ప్రకృతి నుంచి అనేక విషయాలు నేర్చుకోవచ్చు. కంటికి నదురుగా ఉండే రంగులు ప్రకృతి నుంచే గ్రహిస్తాం.వైల్డ్ లైఫ్ విస్పరర్స్ డిజైన్ వర్క్ షాప్ ను నిర్వహించి ప్రకృతి నుంచి పాఠాలు ఎలా నేర్చుకోవాలో కూడా నేర్పుతుంది.ప్రకృతి నుంచి మనకు ఏమి కావాలో,మనం ఏమి ఇవ్వాలో ఈ వర్క్ షాపు అవగాహన కల్పించడం విశేషం.

అమెరికాలో రూజ్ వెల్ట్ హయాంలో వైల్డ్ లైఫ్ జాతీయ పార్కుల స్థాపన ప్రారంభమైంది.కెన్యాలోని మసైమారా పార్క్ 7000 అడుగుల ఎత్తులో 1100 చ.కి.మీ పరిధిలో వ్యాపించి ఉన్నాయి. అక్కడి ఉష్ణోగ్రత సాధారణంగానే ఉంటుంది.ఇండియాలో నేషనల్ పార్క్ లు 100కు పైగా ఉన్నాయి.టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లు 54 వరకూ ఉన్నాయి.అవి 78 వేల చదరపు కిలో మీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి.వాటిలో తడోబా(మహరాష్ట),రంతంబోర్ (రాజస్తాన్)ప్రసిద్ధి చెందినవి.


వైల్డ్ లైఫ్ సందర్శన కు వెళ్లేవారు రెండు రకాల వారు ఉంటారు.సరదాకు వచ్చేవారు,ప్రకృతి,జంతువుల పట్ల ఇష్టంతో వచ్చేవారు ఉంటారు.అలాంటి వారిని రెండు బృందాలుగా విభజించి వారి అభిరుచి మేరకు వారికి సఫారీ చూపిస్తారు.ముందుగా సఫారీ కి వచ్చే వారి అభిరుచులు,వారి ఇష్టాలు,సౌకర్యాలను తెలిపే ప్రశ్నా పత్రం అందజేస్తారు.ఆ మేరకు సౌకర్యాలు, ప్రయాణం ఖర్చు నిర్ణయిస్తారు. సాధారణంగా ఐదు రోజులు,నాలుగు రాత్రులు ట్రిప్ ఉంటుంది. ప్రతిరోజు బసకు రాగానే క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసి ఒకరి అనుభవాలను మరోకరు పంచుకుంటారు.దానివల్ల ఎంతో పరిజ్ఞానం కలుగుతుంది.అందుకు కావాల్సిన ఇన్ పుట్స్ నిర్వాహకులు కల్పిస్తారు.ఇండియాలో అయితే ఒకొక్కరికీ వేలల్లో చార్జీ చేస్తారు.అదే ఆఫ్రికా,అమెరికాలలో అయితే పర్యాటకుల అభీష్టం,సౌకర్యాలు కల్పన మేర రూ. లక్షల్లో ఉంటుంది.కనిష్టంగా ఐదుగురి నుంచి గరిష్టంగా 50 మంది వరకూ బృందాలుగా సఫారీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంటుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

మచిలీ టైగర్

మచిలీ అనే పులి రాజస్తాన్ వైల్డ్ లైఫ్ పార్కు లో ప్రసిద్ధి చెందినది.దానిని చూడడానికి సంవత్సరానికి లక్షమందికి పైగా పర్యాటకులు వస్తుంటారు.ప్రస్తుతం అది చనిపోయింది గానీ దాని పిల్లలు ఉన్నాయి.
పులి వేట విచిత్రంగా ఉంటుంది.పులులు ఒంటరిగా పోరాడతాయి. పులులు మాన్ ఈటర్ గా ఎందుకు మారతాయనే సందేహం ప్రతివారికి కలుగుతుంది.వాస్తవంగా మనిషి శరీరం ఉప్పగా ఉంటుంది.ఉప్పు శరీరాన్ని పులులు తినవు.కేవలం ఆత్మరక్షణ కోసమే దాడి చేస్తాయి.చంపేసి వదిలేస్తాయి.పులి ముసలది కాగానే ముందుజాగ్రత్త చర్యగా దాడి చేస్తుంది.దాడికి ముందు పులి ముందురావద్దని సిగ్నల్ ఇస్తుంది. కాని మనిషి క్యూరియాసిటి ఆపుకోలేక ముందుకు వెళతాడు. ఆ పరిస్థితుల్లో తన మీద దాడికి వస్తున్నాడని దాడి చేస్తాయి.
సింహాలు సమూహం గా కూడా వేటాడుతాయి. సింహాలు గాలికి వ్యతిరేక దిశలో వేటాడతాయి.గాలి వీస్తున్న దిశలో అయితే అవతలి జంతువు వాసన పట్టేస్తుంది. అలా ప్రణాళిక వేసుకుని వేటాడడం వాటి ప్రత్యేకత.జింకలు తదితర జంతువులకు ముందుగా వాసన పట్టేస్తాయని సింహాలు జాగర్త పడతాయి.ఒక సింహం ఆ జంతువుకు కనిపిస్తుంది. అప్పుడు ఆ జంతువు దానికి వ్యతిరేక దిశగా పరుగెత్తుతుంది. మరో సింహం గడ్డి చాటున దాగి నెమ్మదిగా వచ్చి వేటాడుతుంది.ఇవన్నీ ప్రత్యక్షంగా చూడడం నిజంగా థ్రిల్ గా ఉంటుంది కదా.

జంతువుల ప్రవర్తనపై ఇథాలజీ

జంతువుల్లో కూడా నాయకత్వ లక్షణాలు ఉంటాయి.ప్రతి జంతు జాతి లోనూ నాయకుడు ఉంటాడు.జంతువుల ప్రవర్తన గూర్చి ఒక శాస్త్రం ఉంది.దాన్ని “ఇథాలజీ”అంటారు. దీనిపై ఆన్ లైన్ తరగతులు కూడా నిర్వహిస్తారు.ఆస్ట్రేలియా,అమెరికా దేశాల్లో దీనిపై విస్తృతంగా పరిశోధన జరిగింది.ఇథాలజీలో అనేక పుస్తకాలు కూడా ప్రముఖ జంతు ప్రేమికులు పరిశోధించి రాసారు. జాన్ మియర్ ,జాన్ కార్బెట్ చాలా పుస్తకాలు రాసారు.తోరో అనుభవాలు కూడా మంచి అవగాహన కల్పిస్తాయి.
సింహాలు 1.6 మిలియన్ సంవత్సరాల నుంచి ఉన్నాయి.సింహాలు పిల్ల సింహాలకు వేటను నేర్పిస్తాయి.కాని అవి ఆహారం కోసంచేసే వేటలో ఇతర జంతువులను చంపుతాయి.కాని పిల్లలకు వేటనేర్పే క్రమంలో ఆయా జంతువులను గాయపరుస్తాయి తప్ప చంపవు.ఇవన్నీ జంతు ప్రేమికులు వాటి ప్రవర్తన పరీశీలిస్తే అవగతమవుతుంది.
చీమ 97 మిలియన్ సంవత్సరాలుగా సంచరిస్తున్నది.చీమలో ఏడు రకాలు ఉన్నాయి.వాటిలో సేవక చీమ,సైనిక చీమ,గార్డ్ చీమ,రాణి చీమ అలా పని విభజన మేరకు ఉంటాయి.చీమ తన ఆహారం తెచ్చుకునే ప్రయత్నంలో ఎప్పుడూ దగ్గర దారినే ఎన్నుకుంటుంది.
ఏనుగులు 50 మిలియన్ ఏళ్లుగా భూమి మీద నివసిస్తున్నాయి.ఏనుగు 100ఏళ్లు బతుకుతుంది.10 కి.మీ ముందే నీటి సౌకర్యాన్ని గుర్తిస్తుంది.వాటికి 10వేల సంవత్సరాల నాటి తెలివి ఉంటుంది.ఏనుగు తన పిల్లలకు ఆటల రూపంలో తనను తాను ఏలా కాపాడుకోవాలో నేర్పిస్తుంది.
అడవి పందికి జ్ఞాపకశక్తి ఉండదు.అది తనను వేటాడే జంతువును తప్పించుకునే ప్రయత్నంలో ఎక్కడ బయలు దేరింది ఓ అక్కడికి చేరుతుంది. ఇవన్నీ జంతువుల ప్రవర్తన తెలుసుకోవాలన్న ఇష్టం,కుతూహలం ఉంటే తెలుస్తుంది.
మానవుడు కేవలం మూడు లక్షల సంవత్సరాల క్రితమే ఆవిర్భవించాడు.కాని మానవుడికి ఉన్న జ్ఞానం మరే జంతువుకీ లేదు.కాని జంతువులకు ఉన్న తెలివి,వాటి జీవనం,వేట,నాయకత్వ లక్షణాలు తెలుసుకోవడం ఒకరకంగా వాటి పట్ల మనకు ఇష్టం కలుగుతుంది. ప్రకృతితో సంబంధాలు పెరిగి పర్యావరణం పై అవగాహన పెరుగుతుంది. ప్రకృతే మన జీవన విధానంగా మారుతుంది.

ఫ్రీలాన్స్ మోడల్ సాయి కిరణ్….

వైల్డ్ లైఫ్ విస్పరర్స్ సంస్థ భాగవుతుల సాయి కిరణ్ ఆలోచనల లోంచి పుట్టింది.దాన్ని ఫ్రీ లాన్స్ మోడల్ గా ప్రారంభించి తన ప్రవృత్తి, వృత్తి గా చేసుకున్నాడు.సాయి కిరణ్ చిన్నతనం నుంచి జంతు ప్రేమికుడు.యానిమల్ ప్లానెట్,డిస్కవరీ ఛానల్ ఎక్కువగా చూసేవాడు.మంచి ఫోటో గ్రాఫర్. ఇంజనీరింగ్ చదివి అమెరికాకు పై చదువులకు వెళ్లి అక్కడే కొన్నాళ్లు ఐటీ ఉద్యోగం చేసివచ్చిన డబ్బుతో అమెరికా, ఆఫ్రికా వైల్డ్ లైఫ్ నేషనల్ పార్క్ లను సందర్శించారు.ఇథాలజీ క్లాసులు విన్నాడు.జంతుజాలం,వాటి ప్రవర్తన పై అనేక పుస్తకాలను చదివాడు.160పార్కులకు పైగా సందర్శించారు.జంతువుల ప్రవర్తన తన కున్న పరిజ్ఞానంతో పోల్చుకునేవాడు.అటవీ అధికారులతో,ఈ పార్క్ లో చుట్టు ఉన్న గిరిజన తెగలమనుషులతో,గైడ్స్ తో సంబంధాలు తన ఆశయానికి,వ్యాపారానికి బాగా ఉపయోగపడుతున్నాయి.కోవిడ్ సమయంలో ఇండియా వచ్చి ఈ సంస్థను ప్రారంభించి గత సంవత్సర కాలంగా పర్యాటక బృందాలను వైల్డ్ లైఫ్ పార్క్ లకు తీసుకు వెళుతున్నారు.మొట్టమొదటి ట్రిప్ నాగపూర్ సమీపంలోని తడోబా పార్క్ కు ఎనిమిది మంది బృందంతో వెళ్లారు.వారిలో ఆరేళ్ల బాలుడు కూడా ఉండడం విశేషం.ఇటీవల కెన్యాలోని మసైమారా వైల్డ్ లైఫ్ పార్క్ కు 12 మంది బృందంతో వెళ్ళారు.

– యం.వి.రామారావు
8074129668