టీమిండియా మరో చెత్త రికార్డు

క్రీడలు

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఘోర వైఫల్యం
46 పరుగులకే ఆలౌట్‌ అయిన బ్యాటర్లు
బెంగళూరు : స్వదేశంలో తిరుగులేదని భావిస్తున్న భారత్‌కు న్యూజిలాండ్‌ బౌలర్లు షాక్‌ ఇచ్చారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 31.2 ఓవర్లలోనే 46 పరుగులకే ఆలౌటైంది. ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌ కావడం గమనార్హం. ఇద్దరు మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోరు చేశారు. రిషభ్‌ పంత్‌ (20), యశస్వి జైస్వాల్‌ (13) కాసేపు పోరాడారు. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. టిమ్‌ సౌథీ ఓ వికెట్‌ తీశాడు. గత రెండు రోజులుగా వర్షం పడటంతో పిచ్‌ బౌలర్లకు మంచి సహకారం అందించింది. ఆరంభం నుంచే కివీస్‌ పేసర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (2), యశస్వి జైస్వాల్‌ (13) ఆచితూచి ఆడారు. దాదాపు ఆరు ఓవర్లపాటు వికెట్‌ ఇవ్వలేదు. కానీ, రోహిత్‌ ఎటాకింగ్‌ చేసి కివీస్‌ బౌలర్లను దెబ్బ కొడదామని భావించాడు. కానీ, సీనియర్‌ బౌలర్‌ సౌథీ ఇన్‌స్వింగర్‌తో రోహిత్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ (0), సర్ఫరాజ్‌ ఖాన్‌ (0) కివీస్‌ ఫీల్డర్ల దెబ్బకు పెవిలియన్‌కు చేరక తప్పలేదు. వారు ఇచ్చిన క్యాచ్‌లను అద్భుతంగా ఒడిసిపట్టారు. రిషభ్‌ పంత్‌ (20)తో కలిసి యశస్వి జైస్వాల్‌ వికెట్‌ పతనాన్ని అడ్డుకొన్నాడు. దాదాపు 11 ఓవర్లపాటు వికెట్‌ ఇవ్వలేదు. అయితే, యశస్వి ఏకాగ్రత కోల్పోయి ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత భారత ఇన్నింగ్స్‌ కుప్పకూలడానికి మరింత సమయం పట్టలేదు. వచ్చిన బ్యాటర్‌ వచ్చినట్లే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో సిరాజ్‌ (4) బౌండరీ కొట్టాడు. మొత్తం ఇన్నింగ్స్‌లో ఇది నాలుగో బౌండరీ మాత్రమే. రిషభ్‌ 2 కొట్టగా.. ఒకటి యశస్వి బ్యాట్‌ నుంచి వచ్చింది. భారత్‌లో కివీస్‌ మొత్తం పది వికెట్లు తీయడం విశేషం. ఇక్కడ అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్‌గా మ్యాట్‌ హెన్రీ నిలిచాడు. ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మ్యాట్‌ హెన్రీ టెస్టుల్లో అత్యంత వేగంగా వంద వికెట్లు పడగొట్టిన కివీస్‌ బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. హెన్రీ 26 టెస్టుల్లో సాధించగా.. రిచర్డ్‌ హ్యాడ్లీ (25), నీల్‌ వాగ్నెర్‌ (26) ముందున్నారు.
ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక డక్‌లు కావడం భారత్‌కు ఇది ఐదో సారి. ఈ మ్యాచ్‌లో ఐదుగురు బ్యాటర్లు పరుగులేవిూ చేయలేదు. ఇంగ్లండ్‌పై (2014లో) ఆరుగురు డకౌట్‌గా వెనుదిరిగారు. 92 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అత్యల్ప స్కోరు ఇదే. ఈ మ్యాచ్‌లో 46 పరుగులు చేసింది. గతంలో విండీస్‌పై (1987) 75 పరుగులే చేయగలిగింది. ఓవరాల్‌గా మూడో అత్యల్ప స్కోరు. అడిలైడ్‌లో ఆసీస్‌ చేతిలో 36 రన్స్‌కే ఆలౌటైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *