యుద్దప్రాతిపదికన స్కిల్‌ యూనివర్సిటీ

తెలంగాణ

అసెంబ్లీ సమావేశాలకు ముందే ఏర్పాటు
ఐఎస్‌బి తరహాలో బోర్టు ఏర్పాటుకు చర్యలు
విద్యారంగ, పారిశ్రిమక ప్రముఖలలకు సూచన
ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ సందర్శించిన సిఎం రేవంత్‌
హైదరాబాద్‌ : రాష్ట్రంలో స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు ముందే జులై 23 లోపు స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ, విద్యా శాఖ అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సీఎం సూచించారు. వాటిని పరిశీలించి ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో ముఖ్యమంత్రి సోమవారం మధ్యాహ్నం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో స్కిల్‌ డెవెలప్మెంట్‌ పై సమావేశ మయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతో పాటు ప్రముఖుల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అటు ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటీకీ అందుబాటులో ఉన్నందున ఈ సిటీ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని చెప్పారు. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐ.ఎస్‌.బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చర్చ జరిగింది. అప్పటివరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. స్కిల్‌ యూనివర్సిటీలో ఏమేం కోర్సులుండాలి, ఎలాంటి పాఠ్యాంశాలు ఉండాలి.. పరిశ్రమల అవసరాలు తెలుసుకొని, వాటికి అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండేందుకు ఏయే నైపుణ్యాలపై కోర్సులు నిర్వహించాలనేది ముందుగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అధునాతన పరిజ్ఞానం అందించేలా ఈ స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరిక్యులమ్‌, కోర్సులకు సంబంధించి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబుతో చర్చించాలని చెప్పారు. నిర్ణీత గడువు పెట్టుకొని ప్రతిపాదనలు రూపొందించాలని, కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున ప్రతీ అయిదు రోజులకోసారి సమావేశం కావాలని సీఎం వారికి దిశా నిర్దేశర చేశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలా.. ప్రభుత్వమే ఈ బాధ్యతలను చేపట్టాలా… మరేదైనా విధానం అనుసరించాలా.. అనేది కూడా పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్‌స్టలెంట్‌ ను నియమించుకోవాలని సీఎం చెప్పారు. యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమల శాఖ నోడల్‌ డిపార్టుమెంట్‌గా వ్యవహరిస్తుందన్నారు. ఐటీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్‌ సెక్రెటరీ అజిత్‌ రెడ్డి, ఇన్వెస్ట్‌ మెంట్స్‌ ప్రమోషన్‌ స్పెషల్‌ సెక్రెటరీ విష్ణు వర్ధన్‌ రెడ్డి, డాక్టర్‌ రెడ్డిస్‌ ల్యాబ్‌ ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డి, భారత్‌ బయోటెక్‌ హరి ప్రసాద్‌, క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ శేఖర్‌ రెడ్డి, ఐ ల్యాబ్స్‌ శ్రీనిరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మావేశానికి ముందు ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్‌ సెంటర్‌ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు కలియ తిరిగి అందులో ఉండే సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే కాలేజీ సిబ్బందితో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు.