తెలంగాణ సమాజం బానిసత్వాన్ని అంగీకరించదు

తెలంగాణ హోమ్

ప్రేమను పంచడమే తప్ప..పెత్తనాన్ని సహించదు
తెలంగాణ అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం
పాలకులకు, ప్రజలకు మధ్య అడ్డుగోడలను బద్దలు కొట్టాం
మెగా డిఎస్సీ, ఉద్యోగా కల్నన సాకారం చేస్తున్నాం
మద్దతు ధరలకు సకలంలో ధాన్యం కొంటున్నాం
మూడు జోన్లుగా తెలంగాణ అభివృద్దికి కృషి
తెలంగాణ ఇచ్చిన మన్మోహన్‌, సోనియాలకు కృతజ్ఞతలు
అందెశ్రీ జయజయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆవిష్కరణ
పరేడ్‌ మైదానంలో జెండా ఆవిష్కరించి ప్రసంగించిన సిఎం రేవంత్‌ రెడ్డి

సృజనక్రాంతి/హైదరాబాద్‌ : తెలంగాణ జీవనశైలి స్వేచ్ఛ అని.. ఇక్కడి ప్రజలు బానిసత్వాన్ని భరించరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం రాష్ట్ర ప్రజల తత్వమని చెప్పారు. సంక్షేమం ముసుగులో చెరబట్టాలని చూస్తే ఇక్కడి సమాజం సహించదన్నారు. పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. జాతీయ జెండా ఆవిష్కరించి, పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ..కాంగ్రెస్‌ పాలనలో పాలకులు, పాలితుల మధ్య ఉన్న అడ్డుగోడలు బద్దలు కొట్టామని వివరించారు. ఇందిరా పార్కులో ధర్నాలకు అనుమతినిచ్చినట్లు చెప్పారు. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చామన్నారు. తెలంగాణ అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి పదేళ్లు అవుతోందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులకు నివాళులు అర్పించారు. ఆరు దశాబ్దాల కలను నెరవేర్చిన ఆ నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.

బానిసత్వాన్ని తెలంగాణ భరించదని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ యువత కోరుకున్నట్టుగా టీఎస్‌ స్థానంలో టీజీ ఏర్పాటు చేశామని వివరించారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టే సమయానికి రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని రేవంత్‌ గుర్తుచేశారు. రాష్ట సంపద పెంచడం, ఆర్థిక పునరుజ్జీవనం సాధించడం కోసం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కంకణబద్దులై పనిచేస్తున్నామని వివరించారు. తెలంగాణ రాష్టాన్న్రి మూడు జోన్లుగా విభజిస్తున్నామని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వరకు అర్బన్‌ తెలంగాణగా ఉంటుందని వివరించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్‌ వరకు సబర్బన్‌ తెలంగాణ అని.. రీజనల్‌ రింగ్‌ రోడ్‌ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గల ప్రాంతాన్ని గ్రావిూణ తెలంగాణగా పరిగణిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర గీతం ’జయ జయహే తెలంగాణ’ను సీఎం రేవంత్‌ విడుదల చేశారు. తెలంగాణ డ్రీమ్‌` 2050 మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ వచ్చి పదేళ్లయినా రాష్ట్ర గీతం లేదు. అందెశ్రీ రాసిన ’జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతంగా ఉండాలని అనుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటిస్తున్నాం.

జాతి చరిత్రకు అద్దంపట్టేదే రాష్ట్ర చిహ్నం. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది అందులోనే. సూచనలకు అనుగుణంగా నూతన చిహ్నాన్ని రూపొందిస్తున్నాం. ప్రజల ఆకాంక్షల మేరకు టీఎస్‌ను.. టీజీగా మార్చాం. సగటు గ్రావిూణ మహిళా రూపమే తెలంగాణ తల్లి రూపంగా ఉండాలని రేవంత్‌ అన్నారు. తెలంగాణను 3 జోన్లుగా విభజన చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్‌ తెలంగాణ, ఓఆర్‌ఆర్‌ నుంచి రీజినల్‌ రింగ్‌రోడ్డు ప్రాంతం వరకు సబ్‌ అర్బన్‌ తెలంగాణ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రావిూణ తెలంగాణగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మూడు ప్రాంతాలకూ త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని తెలిపారు.

త్వరితగతిన రీజినల్‌ రింగు రోడ్డు పూర్తిచేస్తామన్నారు. తాలు, తరుగు లేకుండా ధాన్యం కొంటున్నాం. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొంటున్నాం. రైతుల ఖాతాల్లో రూ.7,500 కోట్లు జమ చేశాం. మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని చేపడతాం. దీనికోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించాం. ప్రజల అవసరాలకు తగినట్లు మెట్రో విస్తరణ జరుగుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీరు ఇచ్చే ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తాం. డ్రగ్స్‌, గంజాయిని ఉక్కుపాదంతో అణచివేస్తాం అని వివరించారు. ఈ అంశంలో ఎంతటి వారున్నా వదిలిపెట్టం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిధి రూ.10లక్షలకు పెంపును అమలు చేశాం. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. 30వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ ఇచ్చాం.

ఈ ఏడాది 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి రూ.22,500కోట్లు కేటాయించాం. మండల కేంద్రాల్లో అంతర్జాతీయ మోడల్‌ స్కూళ్ల నిర్మాణం మా బాధ్యత. స్కిల్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, రాజకీయ పార్టీల నేతలు. సిఎస్‌ శాంతి కుమారి, డిజిపి రవిగుప్తా తదితరులు పాల్గొన్నారు.

అమరులకు సిఎం రేవంత్‌, మంత్రుల నివాళి
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తొలుత సీఎం రేవంత్‌రెడ్డి గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద అమరులకు ఘనంగా నివాళి అర్పించారు. పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించి శ్రద్దాంజలి ఘటించారు. ఆయనతోపాటు మంత్రులు, ఇతరులు కూడా పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన వారి సేవలను గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, తుమ్మల, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అమర వీరుల స్తూపానికి నివాళి అర్పించారు.

అమరుల స్థూపాన్ని సర్వాంగ సుందరంగా పూలతో అలంకరించారు. మరోవైపు వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం పరేడ్‌ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాల్లో సిఎం పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఉత్సవాలను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాబృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసారు.