సృజన కాంతి, సూర్యాపేట జిల్లా ప్రతినిధి: నిరుపేద ప్రజలు 2019వ సంవత్సరం నుండి సూర్యాపేట జిల్లా చివ్వెంలా మండలం కుడకుడ గ్రామ శివారులోని సర్వేనెంబర్ 126 లోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న భూమిని రెడ్డి కమ్యూనిటీ హాల్ కు కేటాయించిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి నివాసం వరకు భారీ ర్యాలీగా వచ్చి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముట్టడి చేస్తున్న నాయకులను, పేద ప్రజలను అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి పట్టణంలో, పరిసర ప్రాంతాల్లో నిలువ నీడలేని నిరుపేదలు మా పార్టీ ఆధ్వర్యంలో కుడకుడ శివారు సర్వేనెంబర్ 126 లో గల ప్రభుత్వ భూములో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని అన్నారు.
ఆ గుడిసెలను గతంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు అనేకమార్లు రెవిన్యూ, పోలీసు వాళ్ళు గుడిసెలను తొలగించి పేదల పైన, పార్టీ నాయకుల పైన అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. అదే సర్వే నెంబర్లో అనేకమంది గత అధికార పార్టీ టిఆర్ఎస్ నాయకులు, కొంతమంది వామపక్ష నాయకులు అదే భూమిని ఆక్రమించుకుంటే స్పందించని జగదీశ్వర్ రెడ్డి, అతని అనుచరులు 2022లో పేదలు గుడిసెలు వేసుకొని వంటలు చేసుకుని నివసిస్తుంటే వారిపైన టిఆర్ఎస్ గుండాలు, కొంతమంది వారి తొత్తుగా మారిన ఒక వామపక్ష పార్టీ నాయకులతో కలిసి మా పార్టీ మహిళల మీద, కార్యకర్తల మీద, పేదల పైన దాడులు చేయించారన్నారు.
దీని వెనక టిఆర్ఎస్ నాయకుడు గుర్రం సత్యనారాయణ రెడ్డి, అప్పటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి హస్తమున్నదని ఆరోపించారు. అదే గుర్రం సత్యనారాయణరెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ పేరుతో వెంచర్లు చేసి అమ్ముతుంటే పట్టించుకోలేదు అని దుయ్యబట్టారు. ఇదే విషయమై అనేకసార్లు కలెక్టర్, రెవిన్యూ సిబ్బందికి,మంత్రి జగదీశ్వర్ రెడ్డికి పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని మా పార్టీ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదన్నారు. ఎన్నికల ముందు తన అధికారాన్ని ఉపయోగించి రాత్రికి రాత్రి పేదల గుడిసె లేసిన ప్రభుత్వ భూమిని రెడ్డి కమ్యూనిటీ వాళ్లకు కేటాయించడం దారుణమైనదని అన్నారు.ఈ దారుణాన్ని నిరసిస్తూ మిలియన్ మార్చ్ స్పూర్తితో సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ క్యాంప్ ఆఫీసు ముట్టడి చేస్తుంటే పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం జరిగింది అన్నారు.
ఈ అక్రమ అరెస్టును, జగదీశ్వర్ రెడ్డి నియంతృత్వ విధానాన్ని మేధావులు, విద్యార్థులు, ప్రజలు ఖండించి, అతనిపై మా పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ర్ట సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, వాస పళ్లయ్య, డివిజన్ నాయకులు సయ్యద్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు హుస్సేన్,కోశాధికారి వాజిద్, జిల్లా నాయకులు చిత్తలూరి లింగయ్య, పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు చంద్రకళ, కోశాధికారి జయమ్మ, జిల్లా నాయకులు సత్తెమ్మ, రమేష్, రవి, రాజు, పద్మ, రమణ, లక్ష్మి, గౌరమ్మ, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.