రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్య పరిష్కరించుకోవాలి
పదేండ్ల పాటు ఎస్ఎల్బిసి టన్నెల్ పనుల విషయంలో నిర్లక్ష్యం
సమస్య కొలిక్కి రావడానికి మరో రెండుమూడు రోజులు పడుతుంది
టన్నెల్లో ప్రమాదం జరిగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
సృజనక్రాంతి/హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు తొమ్మిది రోజులుగా నిర్విరామం గా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను సమీక్షించారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పలు విభాగాల ఉన్నతాధికారులు ఉన్నారు. తొమ్మిది రోజులుగా నిర్విరామం గా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ను సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు అంశాలను వివరించారు.. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) పనులను వేగంగా పూర్తి చేసి నల్లగొండ జిల్లా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని చిత్తశుద్దితో పనిచేస్తుండగా, అనుకోని దుర్ఘటనగా టన్నెల్ లో ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఇలాంటి విపత్తులు జరిగినపుడు రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. స్వరాష్ట్రంలో పదేండ్ల పాటు SLBC టన్నెల్ పనుల విషయంలో నిర్లక్ష్యం జరిగింది. నిధుల లేమి, విద్యుత్ సరఫరా నిలిపేసిన కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరించిందన్నారు. ఈ ప్రతీష్ఠాత్మక ప్రాజెక్టు పనులను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టి, సంస్థకు బిల్లులు చెల్లించి, సాంకేతిక నిపుణులతో చర్చించి సమస్యలు పరిష్కరించాం. మిషనరీకి సంబంధించి స్పేర్ పారట్స్ అమెరికా నుంచి తెప్పించాం. నల్లగొండ జిల్లా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని చిత్తశుద్దితో పనిచేస్తుండగా టన్నెల్ లో అనుకోని ప్రమాదం సంభవించింది. ఇలాంటి విపత్తు సమయాల్లో అందరం ఐక్యంగా పనిచేయాలి. ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా.. బాధిత కుటుంబాలపై సానుభూతి చూపించి వారిని ఆదుకోవాలన్నారు. ఇండియన్ ఆర్మీ, టన్నెల్ నిపుణులు సహా 11 విభాగలు సహాయక చర్యల్లో పనిచేస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాన్నారు. టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పటికీ ఒక అంచనాకు రాలేదు. ఈ సమస్య ఒక కొలిక్కి రావడానికి మరో రెండు, మూడు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. కన్వేయర్ బెల్ట్ పాడవడంతో లోపల మట్టిని బయటకు తరలించడం ఇబ్బందిగా మారింది. రేపటిలోగా కన్వేయర్ బెల్ట్ ను రిపేర్ చేస్తే లోపల ఉన్న మట్టిని బయటకు తరలించడం సులువు అవుతుంది. ఆ ఎనిమిది మంది లోపల ఎక్కడ చిక్కుకుపోయారో, ఎక్కడ మిషనరీ పాడైపోయిందో అధికారులు ఇంకా పూర్తిస్థాయి అంచనాకు రాలేదు. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష చేశాం. ఇది ఒక విపత్తు.. మనందరం ఏకతాటిపై నిలబడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ ఇది. మేం మనోధైర్యం కోల్పోలేదు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఈ సమస్య పరిష్కరించేందుకు అవసరమైతే రోబోలను ఉపయోగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలనే పట్టుదలతో ఉంది అని ముఖ్యమంత్రి తెలిపారు.