మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సృజనక్రాంతి / యాదాద్రి భువనగిరి ప్రతినిధి
తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని, రైతులు బాగుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆలేరులోని ఏఎన్ఆర్ గార్డెన్లో ఏర్పాటుచేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులుగా రోడ్లు, భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొనీ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటున్నామన్నారు. ఇప్పటివరకు రైతు ఖాతాలో 7650 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణాలను కూడా మాఫీ చేయడం జరిగిందని అన్నారు. ప్రధానంగా నల్లగొండ జిల్లాలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని అన్నారు. జిల్లాలో వివిధ శంకుస్థాపన కార్యక్రమాలలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రితో కలిసి వస్తానని తెలిపారు. ఇక్కడికి వచ్చిన రైతు సోదరీ సోదరీమణులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలో వ్యవసాయ మార్కెట్కు వ్యవసాయ గిడ్డంగులను మంజూరీ చేయిస్తానని తెలిపారు. తెలంగాణ వస్తే త్రాగునీరు, సాగునీరు, ఉద్యోగ అవకాశాలు వస్తాయని, భావించామని అందుకు అనుగుణంగా మా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్ను ఉద్దేశించి మాట్లాడుతూ పదవిని బాధ్యతగా చూసుకోవాలని, బాధ్యతగా భావించినప్పుడే ప్రజలకు సేవ చేయగలుగుతారని మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. మార్కెట్ అభివృద్ధికి రైతు శ్రేయస్సుకు పాటుపడాలని మంత్రి కోరారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని తెలిపారు. ప్రతి ఒక్క ఊరిలో ఉన్న సమస్యల గురించి నాకు తెలుసునని అన్ని సమస్యలను త్వరగా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, గ్రామాలు బాగుంటాయని మంత్రి తెలిపారు. గృహలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా 200 యూనిట్ల వరకు కరెంటును ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలకు సమచిత స్థానం కల్పిస్తున్నామని, దానిలో భాగంగా మహిళలు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో,మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ పచ్చిమట్ల మదర్ గౌడ్, పాలకులు, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
