సాగర్ శ్రీరామకవచం గారు తెలుగు సాహిత్యంలో విస్మరించలేని రచయిత. వారు 14 ఏళ్ల వయసులోనే రచనలు ప్రారంభించి, నవలలు, కవిత్వం, కథ వంటి ప్రక్రియల్లో కృషి చేశారు. సాగర్ రచనలు సామాజిక సమస్యలు, మానవ సంబంధాలు, వ్యక్తిగత సంఘర్షణలు, ఆధ్యాత్మిక శోధనలు లాంటి అంశాలను బలంగా చర్చిస్తాయి. ఆ కోవలోనిదే “నిర్వేదం” నవల కూడా! ఇదొక మార్మిక గాథ. ఇది మనిషి జీవితంలోని వైఫల్యాలు, నిరాశలు, విరక్తి, ఆధ్యాత్మిక శూన్యతను లోతుగా విశ్లేషిస్తుంది.
__________________
అస్తిత్వవాదం, బౌద్ధ తాత్వికత, ఇంకా మానవ మనస్తత్వ శాస్త్రాల సమ్మేళనంగా, డాక్టర్ శేషాచలపతి అనే ఒక మేధావి తన ‘అహం’ నుండి ‘శూన్యం’ వైపు సాగించిన మహా ప్రస్థానంగా ఈ నవల కనిపిస్తుంది.
___________________
నవల ప్రారంభంలో శేషాచలపతి ఒక తార్కికమైన, విజ్ఞాన శాస్త్రం మీద అపారమైన నమ్మకం ఉన్న వ్యక్తిగా పరిచయం అవుతాడు. అతడు మంచి వైద్యుడు కానీ డబ్బు సంపాదించడం, లౌక్యంగా మాట్లాడటంలాంటి భౌతిక ప్రపంచపు తెలివితేటలు లేనివాడు. ఈ కారణంగానే అతడి వివాహ జీవితం విచ్ఛిన్నం అవుతుంది. ఆ తరువాత ప్రాణసమానమైన కూతురు లాలస మరణిస్తుంది. ఈ పరిస్థితులు అన్నీ అతడిని ఒక తీవ్రమైన మానసిక సంక్షోభంలోకి నెట్టేస్తాయి. ఈ దుఃఖమే అతడిలో ‘నిర్వేదాన్ని’ రగిలిస్తుంది. బౌద్ధ దర్శనంలో బుద్ధుడు ముసలితనాన్ని, రోగాన్ని, మరణాన్ని చూసి ఎలాగైతే నిర్వేదం చెందాడో, శేషాచలపతి కూడా లాలస మరణంతో జీవితం యొక్క అనిత్యత్వాన్ని (Impermanence) ముఖాముఖి దర్శిస్తాడు.
శేషాచలపతి సముద్ర తీర గ్రామమైన మోటుమాల వెళ్ళడం, అక్కడే ఉన్న తన రిసార్ట్స్ లో లాలస క్లినిక్ ఏర్పాటు చేయడం ఒక భౌతికమైన పలాయనంలా అనిపించినా, తాత్వికంగా అది తన మూలాలను వెతుక్కునే ప్రయాణం. అక్కడ అతనికి పరిచయమైన వెంకటయ్య అనే జాలరి పాత్ర అత్యంత మార్మికమైనది. వెంకటయ్య సముద్రం నుండి తెచ్చే నాచు (స్పైరూలినా) కేవలం ఒక ఔషధ మొక్క కాదు, అది ప్రకృతి గర్భంలో దాగి ఉన్న ఒక ‘మహా రహస్యం’. శేషాచలపతి విజ్ఞాన శాస్త్రవేత్తగా దాన్ని ఒక ఫార్ములాగా మార్చి మానవాళికి పంచాలనుకుంటాడు. ఇక్కడ శేషాచలపతి ‘జ్ఞానానికి’(Knowledge), వెంకటయ్య ‘అనుభవానికి’(Experience) మధ్య ఒక అదృశ్య యుద్ధం జరుగుతుంది.
నవలలోని ఇతర పాత్రలైన విశాలాక్షి, సమయపాలన, దొంగ జగ్గడు వంటివారు సమాజంలోని వివిధ పార్శ్వాలకు ప్రతీకలు. విశాలాక్షి ఒక నిమిత్త మాత్రపు సహాయకురాలిగా కనిపిస్తూనే, లౌకిక బాధ్యతలను నిర్వహిస్తుంది. దొంగ జగ్గడు కొంత స్వార్ధపరుడు అయినా మంచి మిత్రుడు. కాకపోతే ముందు తాను తరువాతే ఇంకా ఎవరైనా అనుకునే స్వభావం.
ఓబులేసు, చుక్కమ్మ, జమ్మయ్య, మనోరమ, బెత్తం స్వామి వంటి పాత్రలు సమాజంలోని చీకటి కోణాలను, అవయవాల వ్యాపారాన్ని, గంజాయి వంటి సమస్యలను కథలోకి తీసుకువస్తాయి. ఇవన్నీ శేషాచలపతికి లోకం ఎంతటి కుళ్ళుతో నిండి ఉందో చూపిస్తూ, అతనిలోని నిర్వేదాన్ని మరింత పెంచుతాయి.
నాగార్జునుడి శూన్యవాదం ప్రకారం, ఈ ప్రపంచం ఒక ‘మాయాజాలం’. మనం దేనిని సత్యమని నమ్ముతామో అది క్షణికమైనది. శేషాచలపతి ఈ సత్యాలను ఒక్కొక్కటిగా అనుభవిస్తూ తన ‘డాక్టర్’ అనే ముసుగును, తన సామాజిక హోదాను వదులుకుని సంచారిగా మారిపోతాడు.
నాగార్జునుడి శూన్యవాదం (మాధ్యమికవాదం) మహాయాన బౌద్ధ దర్శనంలో కీలకమైనది. ఇది “శూన్యత” అనే భావనను ప్రతిపాదిస్తుంది. శూన్యత అంటే ప్రపంచంలోని అన్ని ధర్మాలు (వస్తువులు, భావాలు, అనుభవాలు) స్వతంత్ర అస్తిత్వం (స్వభావం) లేనివి. అవి ప్రతీత్యసముత్పాదం (dependent origination) ద్వారా మాత్రమే ఉనికిలోకి వస్తాయి. కారణాలు౼ పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తాయి, స్వంతంగా స్వతంత్రంగా లేవు. శూన్యత అంటే “ఏమీ లేదు”(నిహిలిజం) కాదు; అది స్వభావ రాహిత్యం. స్వతంత్ర ఉనికి లేకపోవడం. ఇది మధ్యమ మార్గం (మధ్యమ ప్రతిపద)పై ఆధారపడి ఉంటుంది.
“అస్తి” (ఉంది), “నాస్తి” (లేదు) అనే రెండు తీవ్ర దృక్పథాలను తిరస్కరిస్తుంది. ఈ శూన్యతను అర్థం చేసుకుంటే బంధాల నుంచి విముక్తి, నిర్వాణం సాధ్యమవుతుంది. ‘నిర్వేదం’ నవలలో ఈ శూన్యవాద భావన ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, దాని సారాంశం కథాంశంలో, పాత్రల మానసిక స్థితుల్లో బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా జడల మర్రి ఎపిసోడ్లో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. డాక్టర్ శేషాచలపతి తన జీవితం వైఫల్యాలు, ఓటముల ద్వారా నిర్వేదంలోకి వెళ్లి లౌకిక బంధాల నుంచి విడిపడి, సముద్ర తీరంలో ఉచిత సేవలు చేస్తూ నాచు రహస్య శోధనలో మునిగిపోవడం, శూన్యత ద్వారా వచ్చే విరక్తి, విముక్తి భావనను ప్రతిధ్వనిస్తుంది. లౌకిక ఆసక్తులు, సంబంధాలు స్వతంత్ర అస్తిత్వం లేనివి, అవి క్షణికమైనవి, పరాధీనమైనవి.
బైరాగి, చుక్కమ్మ మధ్య సంగమం, శారీరక లేదా భావోద్వేగ సమ్మేళనం ఒక క్షణిక పూర్ణత్వంలాగా కనిపిస్తుంది, కానీ పులుల సమూహం దాన్ని కేవలం సాక్ష్యంగా చూసి వెళ్లిపోవడం ద్వారా ఆ అనుభవం కూడా శూన్యమే అని సూచిస్తుంది. నవలలోని ఇతర అంశాలు కూడా ఈ శూన్యవాదాన్నే ప్రతిబింబిస్తాయి.
__________________
మొత్తంగా చెప్పాలంటే, ‘నిర్వేదం’ నాగార్జునుడి శూన్యవాదాన్ని ఒక ఆధునిక, మానవీయ, సామాజిక సందర్భంలో పునర్నిర్మాణం చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది జీవిత అర్థహీనతను భయపెట్టకుండా, దాన్ని అంగీకరించి శాంతిని చేరుకోవడానికి ఒక మార్గంగా చూపిస్తుంది.
___________________
కథ క్లైమాక్స్లో వెంకటయ్య తన కొడుకు జగదీష్ కోసం కాక తన మిత్రుడి కోసమే ఆ నాచు రహస్యం వున్న మ్యాప్ ను ఇచ్చినప్పుడు ‘నువ్వు నీ కన్నకొడుకుకంటే నన్ను ఆత్మీయుడిగా మిత్రుత్వం ప్రదర్శించడం గొప్ప పారామితి. నీవు నీకు తెలియకుండానే బౌద్ధం ప్రదర్శించిన, చాటి చెప్పిన దశ పారమితలలో తొమ్మిదో మెట్టు అయిన మిత్రుత్వం పైన నిలబడ్డావు. ఈర్ష్యా ద్వేషాల్ని మనస్సు నుండి తుడిచి పారవేసి, మహా సాగరమైన మైత్రిలో మునిగిపోయావు. పరిశుద్ధ చిత్తంతో సర్వ దుర్లక్షణాలని ప్రక్షాళన చేసుకున్నావు. ఓ మహా మనిషివైన నీకు నమస్కారం చేసే అర్హత కూడా నాకు లేదు’ అని శేషాచలపతి సాష్టాంగ నమస్కారం చేసి, వెంకటయ్యలో ఏక కాలంలో బుద్ధుడు, జీసస్, రమణ మహర్షితోపాటు సమస్త మానవ ఆత్మల తేజస్సు పరిపూర్ణంగా నాకు కనిపించింది “ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః| సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన” అన్న శ్లోకాన్ని గుర్తు చేసుకుంటాడు.
తన మరణం తథ్యమని తెలిసి కూడా లోక కల్యాణం కోసం సిద్ధపడటం అతడిని ఒక ‘బోధిసత్వ’ స్థాయిలో నిలబెడుతుంది. అందుకే శేషాచలపతికి వెంకటయ్యలో జీసస్ లేదా బుద్ధుడు కనిపిస్తారు. కానీ సరిగ్గా ఆ సమయంలోనే ప్రకృతి సహకరించక పోవడం, సముద్రం తన ప్రళయ రూపంతో రహస్యాన్ని మరుగున పడేయడం ఒక అనివార్యత (Inevitability).
ఆచార్య నాగార్జునుడు చెప్పిన ‘శూన్యత’ ఇక్కడే పరిపూర్ణమవుతుంది. సత్యం అనేది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి పదాల రూపంలో వెళ్ళదు; అది అనుభూతి చెందాల్సిన స్థితి. ఆ రహస్యం బయటపడక పోవడమే ఈ నవలకు అసలైన మార్మిక ముగింపు.
రహస్యం చేతికి చిక్కి ఉంటే శేషాచలపతి మళ్ళీ లౌకిక ప్రపంచంలో బందీ అయ్యేవాడు, కానీ అది దొరకకపోవడమే అతడిని ఒక సంచారిగా, ఒక ‘ఆధునిక బుద్ధుడిగా’ మలిచింది. నాగార్జునుడి శూన్యవాదం ప్రకారం ప్రపంచం ‘నిస్వభావం’ అంటే దేనికీ శాశ్వత ఉనికి లేదు. శేషాచలపతి తన అన్వేషణను ఎక్కడ మొదలుపెట్టాడో, అన్నింటినీ కోల్పోయి తిరిగి ఆ ఆది బిందువుకే చేరుకుంటాడు. కానీ ఈసారి అతను ఖాళీగా లేడు, వెంకటయ్య చూపిన త్యాగం మరియు ప్రకృతి మౌనం ద్వారా ఒక పరిపూర్ణతను (Fullness) పొందాడు. అనంత పయనం తర్వాత తనలోని అహాన్ని, జ్ఞాన దాహాన్ని శూన్యం చేసుకుని, ప్రకృతితో మమేకమైన శేషాచలపతి స్థితి, మనిషి చేరుకోవాల్సిన అత్యున్నత తాత్విక శిఖరానికి నిదర్శనంగా నిలుస్తుంది.
శేషాచలపతి ప్రయాణం ఒక వృత్తంలా సాగి, చివరకు ఆది బిందువుకే చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో అతను ఏమీ సాధించలేదని లోకం అనుకోవచ్చు, కానీ అతను ‘తనను తాను’ సాధించుకున్నాడు. తనలోని అహంకారాన్ని, విజ్ఞాన గర్వాన్ని శూన్యం చేసుకుని, ఒక మెటాఫిజికల్ ఎంప్టీనెస్ (ఆధ్యాత్మిక శూన్యం) లోకి ప్రవేశించాడు. ఆ శూన్యం నిరాశతో కూడినది కాదు, అది అన్నీ లీనమై ఉన్న ఒక నిశ్శబ్ద స్థితి. సముద్రం ముందు నిలబడి, దక్కని రహస్యం గురించి బాధపడకుండా, వెంకటయ్యలో దైవత్వాన్ని చూడగలిగే స్థాయికి ఎదిగిన శేషాచలపతి ఇప్పుడు ఒక ‘పూర్ణ మానవుడు’.
ఈ నవల మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే—అన్వేషణలో గమ్యం దక్కకపోవచ్చు, కానీ ఆ అన్వేషణే మనిషిని జ్ఞానిగా మారుస్తుంది. ‘నిర్వేదం’ అనేది మౌనం ద్వారా పొందే ఒక మహా వేదం. “సత్యం అనేది పట్టుకోవడానికి వీలులేని ఒక మెరుపు”. దాన్ని పట్టుకోవాలని చూస్తే కాలిపోతాం. కేవలం దాన్ని దర్శించి మౌనంగా ఉండిపోవడమే ‘నిర్వేదం’.

-వంశీకృష్ణ
95734 27422
