చిత్రకారుని చిత్రతపస్సును స్వప్నిస్తూ …

సాహిత్యం

చిత్రలేఖనం పట్ల ఆసక్తి వున్నా వాటిని చూడటంలోనూ,శీలావీ వేస్తుంటే గమనించటంలోనూ, ఆయన చిత్రాలు మీద వస్తోన్న ప్రతిస్పందనల్ని ఒడిసి పట్టటంలోనూ మాత్రమే శ్రద్ధ పెట్టాను.

వీర్రాజు గారు అక్షర సంపెంగలను రంగుల పేపర్లలో పొందికగా అల్లి పంపిన ప్రేమ పరిమళాలు నన్ను ఆవరించటానికన్నా ముందే, చేతిలో చేయేసి నాతో నడకదారిలో అడుగులో అడుగులు కలపక ముందే లేపాక్షి సుందరులతో చూపుల కౌగలింతల్ని పేపర్ల నిండా చిత్రించారు.
_______________

వీర్రాజుగారు రామప్ప నాగకన్యకలను మెడలో చుట్టుకున్నారు. అజంతా, ఎల్లోరా శిల్పాలను కథన పుష్పాలతో అభిషేకించారు.అయితేనేం వివాహానంతరం కోణార్క శిల్పదంపతులను మాత్రం నా కళ్ళ ముందుకు ఆహ్వానించారు. తర్వాత్తర్వాత ఎప్పుడైనా ఏ దేవాలయాలకైనా వెళ్ళినా.. చేతిలో స్కెచ్ బుక్ పట్టుకున్నప్పుడు అనిమేషుడైన శిల్పంలా చూపుతోనే శిల్పాలను చెక్కుతోన్న ఆయన్ని ఒక మౌనమునిగా చూస్తూ నేనూ నిశ్చలన శిల్పాన్నైపోయేదాన్ని.
______________

డ్రాయింగ్ బోర్డుపైన పేపర్ల నిండా ముఖచిత్రాల కోసం గీసిన రేఖల మధ్య చిక్కుకు పోయినప్పుడు చూపూ, మనసూ, ఆలోచనా ఒకేచోట కేంద్రీకరించిన రుషిలా కనిపించే వారు.

2010 సంవత్సరానికి వచ్చేసరికి ముఖచిత్రాలు పద్ధతి మారి ఫొటోలు,డిజిటల్ చిత్రాల వైపు సాహితీవేత్తలు ఆకర్షితులు కావటంతో వీర్రాజుగారు తైలవర్ణచిత్రాలు వేయాలనే ఆలోచన వచ్చింది. స్వంతంగా కట్టే ఫ్రేములు చేయించి కేన్వాసుబట్ట కొని వాటికి బిగించి తయారు చేసుకుని ఒక చిత్రయజ్ఞాన్ని మొదలు పెట్టారు.

ఉదయం ఎనిమిదికే తయారై టిఫిన్ పూర్తి చేసి ఒక పొట్టి స్టూల్ మీద తాను కూర్చొని ముందు ఇంకో కుర్చీ మీద కాన్వాస్ ఫ్రేమ్ అమర్చుకొని చిత్రం వేయటం మొదలుపెట్టేవారు. తైలవర్ణాలు ఆరటానికి సమయం పడుతుంది కనుక ఒకేసారి రెండుమూడు కేన్వాసులపై చిత్రాలు తయారుగా వుంచుకునేవారు. చుట్టూ రంగులు పరుచుకొని వర్ణచిత్రాలు వేస్తున్నప్పుడు రంగుల సరస్సులో ఇహపరాలు మరచి ఈదులాడుతున్న అమాయకపు పసిబాలుడిలా కన్పించేవారు. భోజన సమయానికి పిలువగా పిలువగా కలుపుకున్న రంగు పూర్తి అయ్యాక గానీ లేచేవారు కాదు. భోజనానంతరం ఒక్క అరగంట ఆగి మళ్ళా కాన్వాస్ ముందు కూర్చునేవారు. ఒక్కోసారి తాగటానికి ఇచ్చిన మంచినీళ్ళ గ్లాసులోనో, కాఫీకప్పులోనో చిత్ర ధ్యానంలో పొరపాటున కుంచెను ముంచేసే వారు.

అనేక కారణాంతరాల వలన ఆత్మీయులైన మిత్రులు కొందరు దూరం కావటం స్నేహాన్ని, స్నేహితులనూ ప్రేమించే వీర్రాజు గారు తట్టుకోలేకపోయారు.ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి అమ్మాయి ఆఫీసుకీ, మనవరాలు స్కూలుకీ వెళ్ళిపోయాక వాళ్ళు తిరిగి వచ్చేవరకూ ఆయన తన రంగుల సముద్రంలో ఈదులాడుతుంటే నేను నా అక్షరం ప్రపంచంలో విహరించేదాన్ని.

రోజుకు సుమారు పది పన్నెండు గంటలు కదలకుండా కూర్చోవడంతో వీర్రాజు గారికి మోకాళ్ళు పట్టేసి నొప్పి చేసేవి. కొన్నిరోజులు విరామం ఇవ్వమన్నా తన చిత్ర తపస్సును ఆపేవారు కాదు.టేప్ రికార్డర్ నుండి నిర్విరామంగా సన్నగా వినవచ్చే లలితగీతాలు తప్ప ఒకే ఇంట్లో వున్నా ఇద్దరం ఎవరి లోకంలో వాళ్ళమే. అప్పుడప్పుడు నేను రాసిన రచనలు వినిపించటమో,ఆ చిత్రాల గురించో తప్ప వేరే మాటలు వుండేవి కాదు.

ఒక్కొక్కసారి నాకు కూడా బొమ్మలు వేయాలనిపించేది. ఒక స్కెచ్ బుక్ కొనుక్కున్నాను. కాని మూడో నాలుగో పెన్సిల్ స్కెచ్ లు వేసి ఆపేసాను.ఆ తర్వాత వీర్రాజు గారు కూడా అంతవరకూ వేసిన చిత్రాలను చిత్రకారీయం అనే పుస్తకం ప్రచురించే పనిలో మునిగిపోయారు.

అమ్మాయి ఇల్లు కొనుక్కోవటంతో పెయింటింగ్స్ దాచుకోవడానికి వీలుగా అరలు కట్టించటంతో మళ్ళా తైలవర్ణ చిత్రాలు వేయటం మొదలు పెట్టారు.అప్పుడు వేసినవి “కుంచె ముద్రలు” గా మరో పుస్తకం ప్రచురించటమే కాకుండా హైదరాబాద్ కళాభవన్ లో ప్రదర్శన ఏర్పాటు చేయటం జరిగింది. అది విజయవంతం కావటంతో చాలా సంబరపడ్డారు. తర్వాత వరుసగా జనసాహితి వారు విజయవాడలో, శిఖామణి గారు యానాంలో,మాటేంటి రవిప్రకాష్ గారు రాజమండ్రీ, వైజాగ్ లలో, పొనుగోటి కృష్ణారెడ్డి గారు కావలిలో చిత్ర ప్రదర్శనకు సహకరించారు. చిత్రకారుడిగా తనకు వచ్చిన గుర్తింపు వీర్రాజుగారిని సంతృప్తి పరిచింది.

______________

విజయవాడ మధుమాలక్షి కన్వెన్షన్ లో చిత్రాలను ప్రదర్శించినప్పుడు ఈమని శివనాగిరెడ్డి గారు లక్షన్నరకి అయిదు పెయింటింగ్స్ కొంటాననీ, అంతేకాక ఒక పెయింటింగ్ తమకు బహుమతిగా ఇవ్వమని కోరారు. కానీ వీర్రాజు గారికి అమ్మటం ఇష్టం లేక అమ్మలేదు కానీ..వారికి ఒక చిత్రాన్ని బహుమతిగా ఇచ్చేసారు.

________________

వయసు అంతకంతకూ మీద పడుతుండటంతో తదనంతరం అమ్మాయికి భారంగా మారుతుందేమోనని ఆ పెయింటింగ్స్ ఏంచేయాలని ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ఫలితంగానే రాజమండ్రి దామెర్ల చిత్రకళా నికేతన్ లో భద్రంగా వుంటాయని భావించి..వీర్రాజుగారు జీవితకాలమంతా వేసిన డెబ్భైకి పైగా తైలవర్ణ చిత్రాలనూ, నీటిరంగుల చిత్రాలను 2022 మార్చి,13న అంకితం చేయటానికి నిశ్చయించారు. ఆ సందర్భంలో ఆయనతోబాటు నేను కూడా ఒక తపస్సులా వీర్రాజు గారు చిత్రాలు వేస్తున్న దృశ్యం మనసులో మెదిలి భావోద్వేగానికి లోనయ్యాను. అపురూపంగా పెంచుకున్న బిడ్డని మరొక చోటికి పెంపకం పెట్టినట్లుగా మా కుటుంబ సభ్యుల హృదయాలు భారం అయ్యాయి.

తిరిగి వచ్చాక వీర్రాజుగారూ నేనూ వివిధ ప్రాంతాల్లో ఆయన చిత్రాల ప్రదర్శనల సమయంలో వచ్చిన వ్యాసాలనన్నింటినీ ఒక చోట చేర్చాము. వీర్రాజుగారి సాహిత్యం మీద వ్యాసాల సంకలనం వచ్చింది. అదే విధంగా చిత్రలేఖనం కృషి మీద కూడా సంకలనం వేసుకోవాలని వీర్రాజుగారు అభిలషించారు. ఉన్నవ్యాసాలు సరిపోవని మరికొందరి చేత రాయించాలని పేర్లు రాసి ఫైల్ చేసారు వీర్రాజుగారు.

తన కోరిక సాకారం కాకముందే మరో రెండు నెలలకే నిష్క్రమించారు వీర్రాజు గారు. ఆ బాధ్యతకు నేను పూనుకుని “ఒక చిత్రకారుడు – కొన్ని అవలోకనాలు” పేరిట గ్రంథస్థం చేయాలని నిర్ణయించాను.

వీర్రాజుగారి కోరిక మేరకు ఆయన కోరుకున్న వారిని వ్యాసాలు రాయమని అడిగితే వారంతా చాలా ప్రేమతో నా కోరిక మన్నించి వ్యాసాలు అందజేసిన ఆత్మీయులకు ధన్యవాదాలు. అంతే కాక, ఫేస్బుక్ మొదలగు సామాజిక మాధ్యమాల్లో వీర్రాజుగారి చిత్రాల మీద వచ్చిన వ్యాసాలు

కూడా సమకూర్చుకొని “ఒక చిత్రకారుడు -అనేక అవలోకనాలు” పేరిట పుస్తకం రూపంలోనికి తీసుకు వస్తున్నాను.

( జూన్ 7వ తేదీన ఆవిష్కృతమయ్యే “ఒక చిత్రకారుడు – అనేక అవలోకనాలు” వ్యాస సంకలనంకు ముందుమాట.)

– శీలా సుభద్రాదేవి