రాజకీయ ప్రాతినిధ్యమే బీసీవాద కవిత్వ ఎజెండా
వెనుకబడిన తరగతుల వాస్తవ జీవనానుభవాలను, వేల సంవత్సరాల అణచివేతను, శ్రమ దోపిడీని, సాంస్కృతిక అణచివేతను ఆత్మకథనాత్మకంగా ఆవిష్కరించినదే బీసీవాద కవిత్వం. సమకాలీన తెలుగు సాహిత్యంలో ఇదొక కీలకమైన సామాజిక కవితోద్యమ రూపం. అంతేకాక ఈ కవిత్వం సామాజిక అసమానతలను, కులాధిపత్యాన్ని, విద్య ఉద్యోగాల్లో బీసీల వెనుకబాటుతనానికి కారణమైన వర్గాలను తీవ్రంగా విమర్శకు గురిచేసింది. దళితవాదం, స్త్రీవాదం, మైనారిటీవాదం వంటి కవిత్వోద్యమాలు తెలుగు సాహిత్యంలో ఒక ప్రవాహంగా వచ్చినప్పటికీ, బీసీవాద కవిత్వం మాత్రం కొంత ఆలస్యంగానే కళ్ళు తెరిచింది.
_____________________
జి.లక్ష్మీనరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ ల సంపాదకత్వంలో “చిక్కనవుతున్న పాట”, “పదునెక్కిన పాట”లు దళిత కవిత్వంగా వెలువడితే, ఆ తర్వాత వచ్చిన “బహువచనం”, “మేమే”, “మొగి” లాంటి సంకలనాలు దళిత, బహుజన కవిత్వంగా వెలువడ్డాయి. అయితే, బీసీలు ఆకలితో చనిపోతే, ఎస్సీలు అవమానంతో చనిపోయారని పేర్కొంటూ, తమ అనుభవాలను రాయాల్సిన బీసీ కవులు ఎస్సీల అనుభవాలను రాసి, తమ అనుభవాలను దాచిపెట్టారని సతీష్ చందర్ ఆరోపించారు.
______________________
ఆ ఆరోపణతో అప్పటివరకు దళితవాదాన్నే తమ వాదంగా భుజాన మోసిన బీసీ కవులు, దళితవాద కవిత్వంలో బీసీల స్థానమేంటో కొంచెం ఆలస్యంగానైనా అర్థం చేసుకున్నారు. మండే నూతన గొంతులను సవరించుకుని సామాజిక, సాంస్కృతిక సమస్యలను చర్చకు పెడుతూ, తమదైన బీసీవాద కవిత్వాన్ని చాలా స్పష్టంగా తెరపైకి తెచ్చారు. అందులో భాగంగా 2001లో 23 మంది బీసీ కవులతో జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన “వెంటాడే కలాలు” అనే ఆత్మకథనాత్మక కవిత్వ తొలి సంకలనంతో, తెలుగు సాహిత్యంలో బీసీ కవిత్వవాదాన్ని ఒక బలమైన వాదంగా, సరికొత్త తాత్విక భూమికతో నూతన చర్చకు దారి తీశారు.
“వెంటాడే కలాలు” వచ్చిన 16 ఏండ్లకు, 2016లో డా. చింతం ప్రవీణ్ కుమార్ సంపాదకత్వంలో “సమూహం” అనే బీసీవాద యువ కవితా సంకలనంతో బీసీవాద కవిత్వం మళ్ళీ తెరపైకి వచ్చింది. అప్పటినుంచి కొత్త సామాజిక దృక్కోణాన్ని, అణగారిన వర్గాల చరిత్రను తిరిగి రాయాలన్న ప్రయత్నంతో అప్రతిహతంగా బీసీవాద కవిత్వం అన్ని పత్రికల్లోనూ ప్రచురింపబడుతూనే ఉంది.
బీసీవాద కవిత్వం అంటే బీసీ కవుల అనుభవైక కవిత్వం. బహుజనుల కులవృత్తుల్లోని అవమానాలు, ఆకలి బాధలు, అప్పులు మొదలైన అంశాలు బీసీ కవిత్వంగా మారాయి. బ్రాహ్మణీయ, భూస్వామ్య, సాంస్కృతిక ఆధిపత్యాన్ని సూటిగా ప్రశ్నించడం కూడా ఈ కవిత్వంలో భాగమైంది. కంసాలి, కమ్మరి, కంచరి, మంగలి, చాకలి, సాలె, యాదవ, బెస్త, గౌడ మొదలైన కులాల్లోని కవులు తమ తాతముత్తాతల అవమానాలను, అనుభవాలను తమ వృత్తి పనిముట్ల భాషా నుడికారంలోంచి కవిత్వమై వెల్లువెత్తించి, బీసీ వృత్తులను, ఆ వృత్తి కళాకారుల నైపుణ్యాలను అవమానం నుంచి అత్యంత గౌరవప్రదమైన స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
దళితవాదంలో దళిత కవులు తమ అణచివేతను ప్రతిబింబిస్తే, ఉత్పత్తి కులాల్లోని బీసీ కవులు వ్యవస్థాగత అణచివేత లాంటి అంశాలను గాఢంగా కవిత్వంలోకి ఒంపి అధికారం లేని స్థితిని ప్రశ్నించారు. అప్పటినుంచి అప్రతిహతంగా బీసీ కవులు తమ వెనుకబడిన జీవిత కులవృత్తుల అనుభవాలను దీర్ఘకవితలుగా రాస్తూనే ఉన్నారు. అందులో ముఖ్యంగా: నాలుగో కన్ను (జూలూరు గౌరీశంకర్), కుంపటి (డా. బాణాల శ్రీనివాసరావు), బువ్వకుండ (అన్నవరం దేవేందర్), తెగినపోగు (డా. పత్తిపాక మోహన్), అసిపే (వనపట్ల సుబ్బయ్య), డాకలి (దాసోజు కృష్ణమాచారి), మండువ (వీరగొని పెంటయ్య), ముస్తాదు (శీలం భద్రయ్య), వంకతాడు (డా. తండ హరీష్ గౌడ్), మెట్న (ఉప్పరి తిరుమలేష్), కొలిమి (గన్నోజు ప్రసాద్). ఈ దీర్ఘకవితల్లోని కవిత్వమంతా కులవృత్తుల గుండెల్లోంచి ప్రవహించిన ఆత్మకథనాత్మక బతుకు కథలే.
దళిత కవిత్వంలోనూ, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాద కవిత్వంలోనూ, బీసీవాద కవిత్వంలోనూ తనదైన ముద్ర వేసుకున్న బలమైన గొంతు జూలూరు గౌరీశంకర్ది. తన తొలి దీర్ఘకవిత “ఎలియాస్” నుంచి “బహుజన గణమణ” వరకు మొత్తం ఇరవై ఐదు (25) దీర్ఘకవితలతో తెలుగు సాహిత్యంలో ఏ కవీ చేయని, చెరిగిపోని సుదీర్ఘ సంతకం చేసిన ఏకైక కవి జూలూరు.
జూలూరు కవిగా నిరంతరం పలు ఉద్యమాలతో సంబంధాలు కలిగి ఉంటూ, అస్తిత్వ చైతన్యంతో కాలాన్ని పరుగులు పెట్టించడమే కాక, తన కవిత్వంలోనూ ప్రవాహ గుణాన్ని కలిగిన అరుదైన కవి. ఆయన “నాలుగో కన్ను” ఆధునిక కవిత్వంలో బీసీ వర్గాల జీవన అనుభవాలను, వారి చారిత్రక నిరాకరణను, రాజకీయ దోపిడీని చాలా స్పష్టంగా వ్యక్తం చేసిన కవిత. బీసీ సమాజం శతాబ్దాలుగా అనుభవించిన అన్యాయంపై ఒక చైతన్యపత్రంగా, అత్యంత శక్తివంతమైన, అరుదైన భావోద్వేగ వ్యక్తీకరణతో సాగి బీసీల ఆత్మగౌరవాన్ని ఎగరేసిన పతాకగా నిలుస్తుంది. బీసీల అనుభవాలనే కేంద్రబిందువుగా చేసుకుని రాయబడిన కవితగా ఇది కనిపిస్తుంది. చీకటిలోకి నెట్టివేయబడిన బీసీల జీవితాలకు వెలుగు మొదలవుతుందన్న సంకేతాన్ని ఈ కవితలో వ్యక్తపరుస్తారు. అనాదిగా బీసీ సమాజం అనుభవించిన పేదరికం, నిరాకరణ, అవమానాలే ఈ కవితకు మూలపదార్థం. ఇప్పటిదాకా సమాజంలో అవమానాలకు, చీదరింపులకు గురైన బీసీ సమూహాలు రాజకీయ అవగాహనతో, ఓటుబ్యాంకుగా వాడబడుతున్నామన్న ఎరుకతో, అధికార నిర్మాణాలను ప్రశ్నించే సామూహిక చూపుతో, చైతన్యంతో అడుగులు వేయాలని కోరుకునే ఈ కవిత రాజ్యాధికారంపై ఘాటైన విమర్శకు బలమైన ఉదాహరణ.
తరతరాలుగా బీసీ సమాజంపై జరిగిన అన్యాయం కేవలం సామాజికమైనది కాదు, అది చారిత్రకమైనది కూడా. అందుకే “కాలమే భరించలేక కరవాలమై లేస్తోంది” అంటారు. రక్తం, కన్నీళ్లతో రాయబడినదే బీసీల చరిత్ర. “తరతరాలుగా మేం రక్తాన్నిచ్చేవాళ్ళం” అని పేర్కొంటూ, బీసీల శ్రమపైనే రాజ్యాలు, భూములు, సంపదలు నిర్మించబడినప్పటికీ, చరిత్ర పుటల్లో చోటు దొరకని వారి మౌన చరిత్రను ప్రశ్నించే స్వరాన్ని ఈ దీర్ఘకవిత అందిస్తుంది.
బీసీలు ఇప్పటికైనా తమ శ్రమను గుర్తించుకుంటూ తమ సంఖ్యను శక్తిగా మలుచుకోవాలంటారు. శ్రమించే వర్గాలకు అధికారం ఇవ్వనటువంటి వ్యవస్థాపరమైన దోపిడీని బహిర్గతం చేసే ధిక్కార పొలికేక ఇది. బహుజనులందరి ఆత్మగౌరవం కోసం, జీవించే హక్కు కోసం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాటం చేయాల్సిన చారిత్రక సత్యాన్ని ఈ కవిత చైతన్యపరుస్తుంది. ఇది కేవలం కవిత మాత్రమే కాదు, ఆధునిక బీసీ ఉద్యమ సాహిత్యానికి ముఖ్యమైన దస్తావేజు కూడా. బీసీ వర్గాల అనునిత్య శ్రమైక జీవన కవిత్వగాథగా, శ్రామికుల స్వాభిమాన ప్రకటనతో భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసాన్ని కలిగించే రాజకీయ చైతన్య కవిత ఇది. శ్రామిక కులాల గౌరవ ప్రతిష్ఠలైన సుత్తె, పట్టెడ, డాకలి, బాడిస, నాగలి, మగ్గం, ఉలి, వలలు వంటి ప్రతీకల ద్వారా బీసీ వర్గాల శ్రమ సంస్కృతిని గొప్పగా ఆవిష్కరించింది.
భూమి దున్నేవాళ్లకు భూమి లేకపోవడమే బీసీల దోపిడీకి మూలమనే చారిత్రక తప్పిదాన్ని స్పష్టపరుస్తారు. ఈ కవితలో ప్రత్యేకమైన గ్రామీణ, మాండలిక భాషను వాడినందువల్ల కవితకు సహజత్వం వచ్చింది. ఈ కవిత బీసీల సూర్యోదయం తప్పదన్న నమ్మకంతో ముగుస్తుంది. ఇది కేవలం చదివే కవిత కాదు, బీసీలందరినీ మేల్కొలిపే ఉద్యమకేక.
వనపట్ల సుబ్బయ్య రాజ్యాధికారమే బీసీల అంతిమ లక్ష్యం అంటూ “బహుజన బావుటా” కవితలో ఇలా అంటారు: “మనది జయం మనదే / రాజ్యాధికారమే ఆశయంగా / రణభేరి మోగిద్దాం” అంటూ చెల్లాచెదురుగా ఉన్న బీసీలందరూ ఆత్మగౌరవ పతాకాలై ఐకమత్యాయుధంతో పోరాడితే, రాజ్యాధికారం మనదేనంటూ భరోసా ఇస్తారు.
గన్నోజు ప్రసాద్ తన కమ్మరి జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన “కొలిమి” దీర్ఘకవితలో ఇలా నిప్పులు చెరుగుతారు: “నిప్పులు తిన్న చేతులకు / సమాజాన్ని మోపుకట్టుకొని / వీపున మోసిన మాకు దేశాన్ని మోసే అధికారం కావాలి! / చేతివృత్తుల సెగలు ఎర్రకోటకు తగలాలి”.
ఈ సమాజంలో సింహభాగం ఉన్న చేతివృత్తుల వాళ్లు రాజకీయంగా చైతన్యవంతులు కాకపోతే మార్పు రాదని, వెనుకబాటుతనానికి ముఖ్య కారణమైన వ్యవస్థ మీద ఐకమత్యంగా తిరుగుబాటు చేయడమొక్కటే ఇప్పటి చారిత్రక అవసరమంటారు. బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుంటే రాజ్యాధికారం సాధ్యమంటారు.
బీసీవాద కవిత్వం బీసీల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, సామాజిక అణచివేతను, అంతర్గత పోరాటాన్ని, అణగారిన వర్గాల అసలు స్వరూపాన్ని వెలికితీసే నిరంతర జ్వాల లాంటిది. ముఖ్యంగా కులవృత్తులు, వాటి తాలూకు సామాజిక వాస్తవాలను ప్రతిబింబించే ప్రత్యేక స్వరంగా బీసీవాద కవిత్వాన్ని చూడవచ్చు. ఇది ఒక ముఖ్యమైన సామాజిక, సాంస్కృతిక ఉద్యమాత్మక కవిత్వధార. బీసీవాద కవిత్వం సమాజంలో సగానికి పైగా ఉన్న బహుజన సమూహాలు తమ అతుకుల బతుకుల బాధలను కప్పిపెట్టకుండా విప్పిచెప్పే కవిత్వమే కాదు; తమను అధికారానికి, విద్యకు, సంపదకు దూరం చేసిన శక్తులపై ఎక్కుపెట్టిన ధిక్కార బాణం కూడా. ఈ కవిత్వం ప్రత్యేక భాషా నుడికారంతో ఉత్పత్తి కులాల జీవన వేదనలను పలికించే కళారూపం. ఈ కవిత్వం పుస్తకాలలోంచి పుట్టింది కాదు; ఇది ముమ్మాటికీ కూలీలు, చేతివృత్తులవాళ్లు, కులవృత్తులపై ఆధారపడిన శ్రమజీవుల చెమట చుక్కల్లోంచి పురుడు పోసుకున్న అక్షర శిల్పం.
________________________
బీసీవాద కవిత్వం ఇంత బలంగా వేళ్లూనడానికి కారణం ఈ కవులు తమ కుల అనుభవ తత్వాన్ని ఆత్మకథనాత్మక తత్వంగా రాయడం మూలానే. అందువల్ల బీసీవాద కవిత్వం ఆధునిక తెలుగు కవిత్వంలో ఒక ప్రధాన పాయగా సాగుతోంది. నిజానికి బీసీవాద సాహిత్యం లేకపోతే తెలుగు సాహిత్య చరిత్రే ఒక అసమగ్ర సామాజిక సాహిత్య చరిత్ర అవుతుంది. బీసీవాదంతోనే తెలుగు సాహిత్య చరిత్ర సంపూర్ణ సాహిత్య చరిత్ర అవుతుంది.
_____________________
ఇప్పటివరకు చెలామణిలో ఉన్న కవిత్వ భాషా భ్రమలను ఈ బీసీ కవులు తమ గ్రామీణ మాండలికాన్ని, వృత్తి పదజాలాన్ని ఉపయోగిస్తూ తొలగించారు. వేల సంవత్సరాలుగా తొక్కివేయబడిన సమాజాల చరిత్రను తిరగరాసే చైతన్య కవిత్వం ఇది. పని చేసిన చేతుల గురించి రాయబడిన కవిత్వ కళాస్వరూపం. రాజ్యాధికారమే పరమావధిగా, రాజకీయ ప్రాతినిధ్యం కోసం పెట్టే పొలికేకే ఈ బీసీవాద కవిత్వం.

ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు
9440471423

Leave a Reply