తెలుగు కథాప్రపంచానికి పరిచయం అక్కర్లేని ప్రసిద్ధ రచయితల క్రమంలో విహారి గారి పేరు ముందే ఉంటుంది. ఎంత ప్రసిద్ధులైనా కొందరు కొంతకాలానికి విరామ రచయితలవుతారు. అయితే 85 ఏళ్ల వయసులోనూ పత్రికలకి సమకాలీనులతో పోటీపడి కథలు రాస్తూ బహుమతులు సైతం అందుకుంటున్న, పొద్దు వాలని, ఎప్పటికప్పుడు తాజాకరించబడిన కలం విహారి ఆయన. కవిగా, వ్యాసకర్తగా, సాహితీవేత్తగా నిత్య నవ్య పథగామి అయిన వారి సరికొత్త కథాసంపుటి ‘నిప్పు నుంచి నీరు’.
‘నీరు నుంచి నిప్పు’ అంటే ఏ బడబానలమనో అనేసుకోవచ్చుగానీ ‘నిప్పు నుంచి నీరు’ అనడంలోనే విహారి గారి నవీకరింపబడిన ముద్ర దర్శించగలం. నేడు ప్రతి ఇంటా ‘డిజిటల్ గేమింగ్ అడిక్షన్’, ‘సెల్ ఫోన్ వాడకం’ అనేవి పిల్లల్ని కనబడని నిప్పులా కాల్చి మసిబారుస్తున్నాయనే అంశాన్నే, అటువంటి భావితరాన్ని తల్లిదండ్రులు ఎలా రక్షించుకోవాలో గ్రహించవలసిన రీతిని, నీతిని చల్లదనంగా వెల్లడిచేసే కథ అది.
ఇరవై కథలున్న ఈ సంపుటిలోని ప్రతి కథా అధునాతన మధ్యతరగతి జీవిత దర్పణాలు. మారుతున్న విలువల దృష్ట్యా సమాజం గ్రహించవలసిన అంశాలను ఒక బాధ్యతాయుత రచయిత అందించే వైఖరి చక్కని కథనాత్మక ఫణితిలో వీటిలో దర్శించగలం.
“ధనం లేకపోవటం పేదతనం కాదు. ఉండీ, ఇతరుల్ని కష్టాల్లో ఆదుకోలేకపోవడమే అసలైన పేదతనం.”
“మనకు ఇది కావాలనీ, అది కావాలనీ ఆశించటం తప్పుకాదు. కానీ ఇతరులకు అది రాకూడదని కోరుకోకూడదు” అని ‘మనిషి బొమ్మ’ కథలో విహారి గారు చెప్పిన మాటలు నిజానికి ఎవరికయినా జీవితాదర్శాలు కాదగినవే.
‘అనివార్యం’ అనే కథలో నగరజీవనంలోని ఏ ఆకర్షణకీ లోనుకాకపోయినా పల్లె నుంచి వలసవచ్చిన జీవులకి ఎలా దుర్భరమో తెలుపుతారు. “నారు పోసినవాడు నీరు పోస్తాడనీ, ఏదో జరిగిపోతూ ఉంటుంది లేమ్మనీ – ఒక మార్గంలో పోవడం కన్నా ఉన్న పునాది మీద నిర్మాణం గురించి ఆలోచించడమే జీవనలిపి అని రాజు, కమలా చేసుకున్న నిశ్చయం” ఎలా సమర్థనీయమో ఉల్లేఖించిన ఈ కథ. ‘వేసక్టమీ’ నేరం కాదు అన్నదానిని “దండింపవలసిన నేరమే లేదు లోకాన – చికిత్స చేయవలసిన రోగమేకానీ” అన్న వాక్యాలతో ఆత్మగీతగా మలచిన కథకుని ప్రతిభ గొప్పది.
_____________________
కథారచనలో వైవిధ్యాన్ని చూపడం కూడా అందరికీ అలవోకగా పట్టుబడే సంగతి కాదు, విహారి వంటి బహుముఖీన ప్రతిభా వైదుష్య సంపన్నత గల రచయితలకు తప్ప. ఆయన సాంఘిక కథల సమకాలీన వైవిధ్యం ఒక ఎత్తయితే, చారిత్రక కథలను, పౌరాణిక వృత్తాంతాలను ఉపయుక్త కథలుగా మలచడం మరో ఎత్తు.
_____________________
ఈ సంపుటిలోని ‘సమాజమే తోడు దీపం’ కథ వారి చారిత్రక కథారచనా వైదుష్యానికి మచ్చుతునక. కల్పనా రామణీయకతను సైతం సమాజ హితచింతనకు ప్రయుక్తం చేయవలసిన బాధ్యత రచయితది అని విశ్వసిస్తారు విహారి. రాయల కాలపు మహర్ణవమి వేడుకలలో భాగంగా పన్నెండు బారల గుంటలో పులితో, విషనాగుతో పోరాడి గెలిచే ఆశ్వికవీరునికి బహుమతులు, సత్కారాలతో బాటు కోరుకున్న వరం తీరగలదనే సవాలును స్వీకరించి తిమ్మప్ప విజయుడవ్వడమే కాదు… “ప్రభువుల వారికి విన్నపం. నేను ఇంత సాహసం చేసింది ఈ వరం కోసమే ప్రభూ! మాది కురువ కులం. మా వంశాచార ప్రకారం పెళ్లి చేయాలంటే ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లికొడుక్కి 101 వరహాలు, పెళ్లి సుంకం కింద ప్రభుత్వానికి 7 వరహాలు చెల్లించాల్సి వస్తోంది. ఇంత సొమ్ముని కూడబెట్టుకోలేక చాలామంది పేదలైన కురువకులం ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి. కనుక ప్రభుత్వానికి చెల్లించే 7 వరహాలతో సమానంగా పెళ్లికొడుక్కి కూడా 7 వరహాలే చెల్లించేట్లు అనుమతించి శాసనం ఇప్పించమని మనవి చేసుకుంటున్నాను ప్రభూ!” అంటూ తిమ్మప్ప రాయలనుండి ఆ వరం పొంది ఎలా ఒక సామాజిక లక్ష్య సాధకునిగా, ఒక సంస్కృతి అభ్యుదయ వర్ధకునిగా, ఒక జాతి ఆరాధనీయునిగా నిలచిందీ… అలాగే మరో ఏడాది ఢిల్లీ పాదుషా విజయనగరానికి పంపిన జవనాశ్వాన్ని పోటీలో లొంగదీసుకుని వేడుకకే కాదు, సామ్రాజ్య పరువు ప్రతిష్టలను నిలిపేందుకు సాముకత్తి పట్టి విజయుడై తిమ్మప్ప ఎలా చారిత్రక మహావిజేతగా, స్ఫూర్తిప్రదాతగా నిలిచింది విహారి గారి ఈ కథనం ఆద్యంతం ఉత్కంఠభరితంగా చదివిస్తుంది.
నవనాగరిక ఆధునిక బాంధవ్యాల జీవన శైలిని ఒడిసిపట్టిన మరో కథ “రెండు రెండు ముఖాలు”. “మనిషి కేవలం తన వ్యక్తిగతానికే పరిమితం కాదు. సమాజం తానులోని ముక్క కూడా. రెండు పాత్రల పోషణలోనూ ‘బాధ్యత’ని వేరుచేసి చూడలేము. చర్యకి ప్రతిచర్య, పరిణామాలకి పర్యవసానాలూ తప్పకుండా ఉంటాయి.”. “అయితే ప్రాకృతిక సహజాతాల మాట ఏమిటి?”. “అయినా చివరికి ఎవరేం చేయదలుచుకుంటారో అదే చేస్తారులెండి!”.
తండ్రి మరణానంతరం తల్లిలోని మార్పుకు పెద్దదైన కూతురు తీసుకున్న నిర్ణయాన్ని విహారి గారు కథగా మలచిన తీరు ఆయన ఎంత తాజా తాజాగా వర్తమాన విషయాల పట్ల అవగాహన, అవలోడనం కల అసాధారణ సీనియర్ రచయితో తెలియచేస్తుంది.
విహారి గారి కథలతో ఒకప్పటి తరం పాఠకులే కాదు ఇప్పటి తరం పాఠకులు కూడా కనెక్ట్ కాగలగడమే 85 ఏళ్ల వయసులోనూ కథారచయితగా ఆయన ప్రాచుర్యానికి, ప్రతిభా విశేషానికి కారణం. అందుకే ఆయన నిజానికి పాఠకులకే కాదు కథకులకే కథకుడు. ‘నిప్పు నుంచి నీరు’ కథాసంపుటి ముఖ్యంగా నేటి సంక్షుభిత వర్తమాన మధ్యతరగతి సమాజానికి దర్పణం మాత్రమే కాదు, తమ అనుభవసారంతో కథారచయిత విహారి గారు వారికి చేస్తున్న ఓ దిశా నిర్దేశన ఉపయుక్త కథాసంపుటి. మారుతున్న కాలానికి రచయితల బాధ్యతలను సైతం గుర్తుచేసే ఉదాహరణాత్మక కథల కాణాచి.
(నిప్పు నుంచి నీరు (కథా సంపుటి) రచయిత: విహారి, పేజీలు: 155, వెల: 200/-, ప్రతులకు: J.103, రాజపుష్ప అట్రియా, గోల్డెన్ మైల్ రోడ్, కోకాపేట, హైదరాబాదు – 500075 (TG) ఫోన్: 98480 25600)

-సుధామ
98492 97958














Leave a Reply