భద్రాచలం వద్ద రెండో బ్రిడ్జి నిర్మాణం
పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం రామాలయం దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం రెండో బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చిన లక్షలాది మంది భక్తులకు ఒకే బ్రిడ్జి ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చాయని ప్రస్తావించారు. భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి పనుల గురించి అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు. అమరావతి టూ జగదల్పూర్ జాతీయ రహదారిని భద్రాచలం మీదుగా ప్లాన్ చేసి రెండో బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ బ్రిడ్జి అప్రోచ్ వరద కోతకు గురవకుండా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ నెలలో గోదావరి రెండో బ్రిడ్జిపై రాకపోకలు కొనసాగుతాయని చెప్ప్పుకొచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి ఈ బ్రిడ్జిని తీసుకువస్తామని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగాయని అన్నారు. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా వయా భద్రాచలం వెళ్లే ప్రయాణికులకు ఈ రెండో బ్రిడ్జి ఎంతో సౌకర్యంగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Leave a Reply