బెంగాల్ తారాపీఠ్ హోటల్లో మంటలు- ఏడుగురు మృతి
బెంగాల్ తారాపీఠ్ హోటల్లో మంటలు
ఏడుగురు మృతి
నిద్రలో ఉండగా తెల్లవారు జామున ప్రమాదం
కోల్కతా : పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్ జిల్లా తారాపీఠ్లో ఒక హోటల్లో మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున గ్రౌండ్ప్లోర్లోని హోటల్ రిసెప్షన్లో ఈ మంటలు మొదలయ్యాయి. క్షణాల్లోనే భవనమంతా వ్యాపించాయి. అప్ప్పుడు అతిథులంతా నిద్రలో ఉన్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఓ నాలుగు అంతస్తుల హోటల్ భవనంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఏడుగురు సజీవ దహనం కాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో హోటల్ గ్రౌండ్ ప్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ యÖనిట్లలో సాంకేతిక లోపం కారణంగా మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు చెలరేగడంతో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం క్షణాల్లోనే పొగ అలుముకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు.. స్థానికులతో కలిసి రక్షణ చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసి మృతులను, గాయపడిన వారిని రాంపూర్హాట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, బాధితులంతా ప్రసిద్ధ కాళీ ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులుగా తెలుస్తోంది. అగ్నిప్రమాద ఘటనపై కోల్కతాకు చెందిన ఓ బాధిత మహిళ అతిథి స్పందించారు. హోటల్ మొత్తం పొగతో నిండిపోయిందని, దాని వల్ల చాలా మంది తప్పించుకోలేక పోయారని తెలిపారు. అలాగే, పలువురు శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది పడ్డారని వెల్లడించారు. బయటకు వచ్చేందుకు దారీ కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హోటల్లో కనీస అగ్నిమాపక భద్రతా చర్యలు లేవని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఫైర్ అలారం కూడా పనిచేయలేదని పేర్కొన్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply