వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యుటిసి) 2025 ఫైనల్ ముహుర్తం ఖరారైంది. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా ఈ బిగ్ మ్యాచ్ జరగనుంది. ఈ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా వెల్లడించింది. లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా జూన్ 11-15 మధ్య ఈ మెగా టెస్ట్ ఫైనల్ జరగనుందని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది. జూన్ 16 రిజర్వ్ డేగా కేటాయించింది. లార్డ్స్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. టెస్ట్లకు ఆదరణ పెంచాలనే లక్ష్యంతో 2019లో డబ్ల్యూటీసీ టోర్నీని ఐసీసీ ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి ఎడిషన్ డబ్ల్యూటీసీ 2019-21 ఫైనల్ సౌతాంప్టన్ వేదికగా జరగ్గా.. న్యూజిలా్ండ విజేతగా నిలిచింది. ఫైనల్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియాను ఓడించి మరి కివీస్ తొలి డబ్ల్యూటీసీ టైటిల్ను సొంతం చేసుకుంది. తర్వాతి ఎడిషన్ ఫైనల్ సౌతాంప్టన్లోని ఓవల్ మైదానం వేదికగా జరగ్గా.. ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఫైనల్లో మళ్లీ భారత్ ఓటమిపాలైంది. తాజా ఎడిషన్ డబ్ల్యూటీసీ 2023-25 భారత్ ఫైనల్ చేరే దిశగా సాగుతోంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ రెండో స్థానంలో న్యూజిలా్ండ మూడో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్ నాలుగో స్థానానికి దూసుకొచ్చింది. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్లతో టెస్ట్ ఫార్మాట్కు దూరంగా ఉన్న టీమిండియా.. రాబోయే నాలుగు నెలల్లో మూడు టెస్ట్ సిరీస్లు ఆడనుంది. మొత్తం 10 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి భారత్ వేదికగా బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్ ప్రారంభం కానుంది. తర్వాత న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. అనంతరం ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఒకవేళ భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరితే.. ఈ మ్యాచ్ ముగిసిన ఐదు రోజులకే ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.
