‘పరావలయం’ – అంతరంగ స్పందనల సాహిత్య వలయం

కవిత్వం అనేది కేవలం భావ వ్యక్తీకరణ కాదు. అనుభూతి చెందుతూ రాసుకునేది. అది సహజంగా, లోపలి ఒత్తిడితో బయటకు వచ్చినప్పుడు మాత్రమే పాఠకుని గుండెను తాకగలదు. ఈ భావనకు సాక్ష్యంగా నిలిచే కవితా సంపుటి ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ రచించిన ‘పరావలయం’.
ఈ సంపుటిలోని కవితలు ఏ విధమైన సిద్ధాంత బరువుతోనో, అలంకారాలతోనో నిండిపోలేదు. ఇవి తన అంతరంగంలో పుట్టిన సహజ స్పందనలు. అందుకే ప్రతి కవిత ఒక అనుభవంగా, అందులో లీనమైనట్టుగా అనిపిస్తుంది. కవి ఎక్కడా అతి చేయకుండా, అణుకువైన భాషలో గాఢమైన భావాలను వ్యక్తపరచడం ఈ సంపుటి ప్రధాన విశేషం.
తెలంగాణ నేలతో కవికి ఉన్న అనుబంధం ఈ కవిత్వంలో స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది. గతం, వర్తమానం మధ్య సంభవించిన మార్పులను కేవలం చరిత్రగా కాకుండా, భావోద్వేగాల ప్రవాహంగా ఆవిష్కరించారు. ఉదాహరణకు:

అలుగు మీదుగా పారాల్సిన నీటిని
ఆత్మహత్యల ఉరితాళ్ళుగా పేనిన
సమైక్యవాదం…

ఒక ప్రాంతీయ బాధను మాత్రమే కాకుండా, సమాజంలోని లోతైన విరోధాలను కూడా ప్రతిబింబిస్తాయి. అదే సమయంలో ఆశను, పునరుజ్జీవనాన్ని కూడా సున్నితంగా పలికిస్తారు..
చెరువు అంటే చనుబాల ధార
మత్తడి దునికితే పొలాల పులకరింత
వ్యక్తిగతం మరియు సామాజికం పరస్పరం మిళితమై కనిపిస్తాయి. విరహం, నిరీక్షణ వంటి వ్యక్తిగత అనుభూతులు కూడా సామూహిక అనుభవాలుగా మారతాయి.
నిద్ర ఒలికిన ఆ రాత్రంతా
ఆమె జ్ఞాపకాల్లో
ఇటూ అటూ దొర్లుతుంటే
నాకు విరహపు మరకలు
అంటుకున్నాయి.

ఇలాంటి మాటలు సున్నితమైన భావప్రపంచాన్ని మనకు దగ్గర చేస్తాయి.

సామాజిక సమస్యల పట్ల తను చూపే స్పందన కూడా గమనార్హం. వలస కార్మికుల దుస్థితిని వ్యక్తం చేస్తూ:

నగరాల్లో వంతెనలై
దారుల మీద రహదారులమై
చివరకి రద్దు చేసిన నోట్లలా
వలస కార్మికులమై నడక
అని రాసినప్పుడు, అది కేవలం కవిత్వం కాకుండా కాలానికి సవాలుగా నిలుస్తుంది.

ఈ సంపుటిలోని స్మృతి కవితలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. కళాకారులపై, వారి గైర్హాజరీపై వ్యక్తం చేసిన భావాలు మృదుత్వంతో నిండి ఉంటాయి.
వసంతం వాకిట్లో నీవు రాలిపోయి
పువ్వులు నీ వియోగాన్ని తట్టుకోలేక
కన్నీటి ధారలై కరిగిపోతున్నవి…

ఈ కవిత్వంలో ప్రధానంగా కనిపించేది సరళతలోని సౌందర్యం. క్లిష్టమైన పదజాలం లేకుండా, సహజమైన ఉపమానాలతో లోతైన భావాలను వ్యక్తపరచడం తనకు సాధ్యమైంది. ప్రతి కవితలో ఒక గాఢత, ఒక మర్మం, ఒక నిశ్శబ్ద అనుభూతి దాగి ఉంటుంది.

మొత్తంగా చూస్తే, ‘పరావలయం’ మంచి కవితా సంపుటి. అది కాలం, మనసు, సమాజం మధ్య సాగే సంభాషణ.. నెమ్మదిగా, ఏకాంతంలో ఆస్వాదించాల్సిన కవిత్వం.

ఈ సంపుటి ద్వారా ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ తన కవితా స్వరాన్ని మరింత స్పష్టంగా, బలంగా ప్రతిష్ఠించుకున్నారు. తెలుగు కవిత్వంలో ఈ సంపుటి ఒక ప్రత్యేక స్థానం సంపాదించగలదనే నమ్మకం కలుగుతుంది.

-ఎన్. లహరి
98855 35506