గేయ రచయిత ధర్మ తేజకు పరిశ్రమ వర్గాల ప్రశంసలు
హైద్రాబాద్ , సృజన క్రాంతి ప్రత్యేక ప్రతినిధి : అయోధ్య రాముడిపై తెలుగు, హిందీ భాషలలో రూపొందించిన పాటలను తెలంగాణ గవర్నర్ డా. తమిళసై ఆవిష్కరించారు. ప్రముఖ దర్శకుడు, గేయ రచయిత ఓరుగంటి ధర్మ తేజ తెలుగులో ఈ పాటలను రాయగా, హిందీలో సతీష్ శ్రీ వాస్తవ సాహిత్యాన్ని అందించారు. బి. ఎస్. కృష్ణ మూర్తి సంగీతాన్ని అందించిన ఈ పాటలను ది మ్యూజిక్ గ్రూప్ బృందం సహకారంతో గాయకుడు సాయి చరణ్ తెలుగులో ఈ పాటలను పాడగా, హిందీలో సాయి చరణ్, జయరామ్ లు ఆలపించారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ గేయాలను త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పరిశీలిస్తారు. అయోధ్య రాముడిపై తెలుగు వారికి అత్యంత వినసొంపైన పాటలను అందించే దిశగా చేసిన ఈ ప్రయత్నం ఫలించడంతో పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ పాటలను త్వరలో అయోధ్యలో జరుగనున్న ప్రతిష్టా కార్యక్రమంలో ప్రసారం చేయనుండడం విశేషం.
కాగా, తెలుగు గేయ రచయిత ఓరుగంటి ధర్మ తేజ సంగీత దర్శకుడిగా, గేయ రచయితగా ఇప్పటికే అనేక సినిమాలకు, ఆల్బమ్ లకు , సీరియళ్లకు పని చేశారు. ఆయన సినిమాలకు రాసిన అనేక పాటలు జన బాహుళ్యంలో బహుళ ప్రచారం పొందాయి. ప్రస్తుతం కొన్ని నూతన చిత్రాలకు గేయాలను, స్వరాలను సమకూరుస్తున్న ధర్మతేజ , ప్రసిద్ధ గేయ రచయిత వేటూరి సుందర రామమూర్తి శిష్యుడు కావడం అందరికీ తెలిసిందే… వేటూరి వారితో కలిసి ఆయన వందలాది చిత్రాలకు పని చేశారు. పరిశ్రమలో ఓ సమర్ధత కల్గిన గేయ రచయితగా, సంగీత దర్శకుడిగా పేర్గాంచిన ధర్మ తేజ అయోధ్య రాముడిపై పాటలను అందించడం ప్రశంసించదగిన విషయమని పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad














