విజయవాడలో ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు-2025’

నవంబర్ 22 , 23 రెండు రోజుల పాటు సాహిత్య సాంస్కృతిక వేడుకల లోగో ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ

తెలుగువారు ఎక్కడున్నా ఈ వేడుకల్లో పాల్గొనవచ్చు .ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ సౌజన్యంతో మల్లెతీగ సాహిత్యసేవాసంస్థ నిర్వహణలో నవంబరు 22, 23 తేదీలలో సాంస్కృతిక రాజధాని విజయవాడలో ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు-2025’ పేరుతో రెండు రోజుల పాటు సాహిత్య సాంస్కృతిక వేడుకలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల లోగోను సోమవారం ఎన్. టి.ఆర్. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. కవులు, రచయితలు, కార్టూనిస్టుల ఆత్మీయ సమ్మేళనంగా రూపొందుతున్న ఈ ఉత్సవాలలో సాహిత్యం, భాష, సమకాలీన సమస్యలు వంటి వివిధ అంశాలపై సదస్సులు జరుగుతాయి. కవి సమ్మేళనం, పుస్తకావిష్కణలు, సత్కారాలు వుంటాయి. ఈ సందర్భంగా సమకాలీన సమస్యలపై కథ, కవితల పోటీ, పర్యావరణం, సోషల్ మీడియా, ధూమపానం, డ్రగ్స్ వంటి అంశాలపై కార్టూన్ల పోటీలు వుంటాయి. పోటీలో గెలుపొందిన రచయితలకు, కవులకు, కార్టూనిస్టులకు నగదు బహుమతులు వుంటాయి.

పోటీకి వచ్చిన రచనలు, కార్టూన్లతో ఒక ప్రత్యేక సంచిక కూడా వెలువడుతుంది. కవి సమ్మేళనంలో పాల్గొనేవారు 30 లైన్లకు మించని కవితలు గానీ లేదా గేయం, పద్యం, గజల్ చదవొచ్చు. నాలుగు నిమిషాలకు మించని సందేశాత్మకమైన ఏకపాత్రలు, స్కిట్స్ కూడా చేయవచ్చు. ఇవి మహిళల్ని కించపరిచేవిగా వుండకూడదు. పాల్గొనాలన్న ఆసక్తి వున్న వారు తమ రచనల్ని, ఏకపాత్రల్ని, స్కిట్స్ ను ముందుగా malleteega.sss@gmail.com ఈమెయిలుకు పంపాలి. ఆమోదం పొందిన రచనల్ని, స్కిట్స్ ను మాత్రమే ప్రదర్శనకు అంగీకరిస్తారు. మీ రచనలు, స్కిట్స్, ఏకపాత్రల్ని పంపాల్సిన చివరి తేదీ అక్టోబరు 25. పూర్తి వివరాలకు 92464 15150, 83329 03156 నెంబర్లలో సంప్రదించవచ్చు.